దళారిలకే ఆదాయం
కాకినాడ, జూలై 19 (way2newstv.in)
రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన రావులపాలెం మండలం రావులపాడులోని మార్కెట్యార్డుకు నిత్యం సుమారు 20 నుంచి 25 వేల వరకు అరటి గెలలను రైతులు విక్రయాలకు తీసుకొస్తుంటారు. ఈ మార్కెట్ యార్డుకు రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కడియం, పి.గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి రైతులు సైకిళ్లు, మోటారుసైకిళ్లు, రవాణా వాహనాలపై ప్రతిరోజు తాము పండించిన గెలలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. జిల్లాలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, గన్నవరం మండలాలతో సీతానగరం, తుని, రాజానగరం, అంబాజీపేట, అయినవిల్లి తదితర మండలాల్లో సుమారు 17 వేల హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. వీటిలో 50 శాతం వరకు కర్పూర రకం అరటిని రైతులు సాగు చేస్తున్నారు.
రావులపాడులోని మార్కెట్ నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల అరటిగెలలను 30కు పైగా లారీల్లో చెన్నై, కర్ణాటక, హైదరాబాదు, విజయవాడ, ఒడిశా, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లో అరటికి డిమాండ్ లేకపోవడం, ముహూర్తాలు లేకపోవడం, పంట సాగు ఇతర ప్రాంతాల్లో కూడా పెరగడం కారణాలు ఇక్కడ సాగు చేస్తున్న అరటిరైతులను కుంగదీస్తున్నాయి.అరటి రైతులు అత్యధికంగా కర్పూర రకాన్నే సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈగెలలను నిత్యం వేల సంఖ్యలో మార్కెట్కు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కర్పూర రకం ధరలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఒక సైకిల్పై ఆరు కర్పూర గెలలను తీసుకువచ్చి విక్రయిస్తుంటే రూ.300 నుంచి రూ.600 మాత్రమే ధర వస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నెల రోజుల కిందట గెలకు ధర రూ.300 వరకు ఉండగా ప్రస్తుతం రూ.100కు మించి రావడంలేదని రైతులు అంటున్నారు. సైకిల్పై గెలలను మార్కెట్కు తరలిస్తే రూ.100 నుంచి రూ.120 వరకూ కూలీలు చెల్లించాల్సి ఉండడంతో ఇక రైతుకు మిగిలేది నామమాత్రమేనని వాపోతున్నారు. అరటి పిలక నాటినప్పటి నుంచి గెల కోసే వరకు పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకు పైబడి అవుతుండగా ప్రస్తుతం రూ.50 వేలకు మించి రావడంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు
No comments:
Post a Comment