Breaking News

20/04/2019

చెక్ పవర్ పై స్పష్టత కరువు

కరీంనగర్, ఏప్రిల్ 20, (way2newstv.in)
పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉండాలి. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. వీటన్నింటికీ నూతన పాలక వర్గం ఏర్పడింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జనాభా దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాస్తవానికి ఒక్కొక్కరికి రూ.259 చొప్పున నిధులు సంబంధిత పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా, మోటార్ల కొనుగోలు, రిపేర్లు, వీధి దీపాల నిర్వాహణ, కొనుగోళ్లు, అంతర్గత రోడ్లు తదితర పనులు చేపట్టొచ్చు. ఎండలు మండుతుండడంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది.కానీ ప్రజల చేత ఎన్నుకోబడి, గ్రామ సర్పంచుగా పదవి చేపట్టి రెండు నెలలు గడిచినా చెక్ పవర్‌పై స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నిధులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడత నిధులు మంజూరయ్యాయి.  


చెక్ పవర్ పై స్పష్టత కరువు

అయా జిల్లాలకు జనాభా ప్రాతిపదికన 14వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. కానీ వాటిని వాడుకునే పరిస్థితుల్లో లేదు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన చెక్కుపై రెండో సంతకం ఎవరూ పెట్టాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2018 జూలై నాటికి పాత సర్పంచుల పదవీ కాలం ముగియడంతో 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పట్లో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది.  జనవరి 2019లో గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టారు.2018 ఏప్రిల్ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలన్న నిబంధనలు పొందు పరిచారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త నిబంధన అమలు కాదని అదే నెలలో సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు ఎప్పటి మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోయినా పంచాయతీ నిధుల నుంచి రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు వాపోతున్నారు. ఈఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి నిధులను మంజూరు చేసింది.మురికి కాల్వలు, విద్యుత్ దీపాల ఏర్పాటు అత్యవసరం కావడంతో చాలామంది సర్పంచులు సొంతంగా ఖర్చు చేసి పనులు చేయించారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో 2018లో స్పెషల్ ఆఫీసర్లు పదవీ బాధ్యతలు చేపట్టగానే అదే సంవత్సరం ఆగస్టులో పంచాయతీరాజ్ కమిషనర్ ఒక ఉత్తర్వులు ఇస్తూ ప్రత్యేక అధికారి, కార్యదర్శి సంతకాలను అనుమతించాలంటూ స్పష్టత ఇచ్చారని సర్పంచులు అంటున్నారు. ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అప్పటి లాగానే సర్పంచుతో పాటు కార్యదర్శులకు అవకాశమివ్వాలని  కోరుతున్నారు. గత మార్చి తోనే ఆర్థిక సంవత్సరం ముగిసినందున అప్పు చేసి పనులు చేసిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.

No comments:

Post a Comment