శిఖా చౌదరి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నందిగామ ఫిబ్రవరి 2 (way2newstv.in)
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జయరాం హత్య కేసులో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. శిఖా చౌదరి అనే మహిళను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిఖా చౌదరి.. జయరామ్కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. శిఖా చౌదరిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.హైదరాబాద్ గచ్చిబౌలిలోని శిఖా చౌదరి ఇంటి వద్ద నందిగామ పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
జయరాం హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
గత నెల 29న రాత్రి శిఖా చౌదరి ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. 31న రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కాపలాదారుడు పోలీసులకు తెలిపాడు. గతంలో శిఖా చౌదరి ఓ న్యూస్ ఛానల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు సమాచారం. ఈ ఛానల్ను జయరాం నిర్వహించేవాడని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుమార్జిన్ దిగి ఉన్న ఆయన కారు(ఏపీ16ఈజీ 0620)లో గురువారం అర్ధరాత్రి మృతదేహం కనిపించింది. వాహనంలో ఒక్కరే ఉండటం, డ్రైవర్ లేకపోవటం, మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
No comments:
Post a Comment