Breaking News

04/02/2019

యాత్ర రెండు గంటలే

హైద్రాబాద్, ఫిబ్రవరి 4, (way2newstv.in)
ప్రస్తుతం బయోపిక్‌ల కాలం నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లో జీవిత కథలను తెరకెక్కిస్తున్నారు. క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తుల జీవిత కథలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే ‘బాగ్ మిల్కా బాగ్’, ‘ఎం.ఎస్.ధోనీ’, ‘దంగల్’, ‘సంజు’ ఇలా చాలా బయోపిక్‌లు వచ్చాయి. అలాగే తెలుగులో తాజాగా ‘యన్.టి.ఆర్’ బయోపిక్ వచ్చింది. దీన్ని ఒక్క సినిమాగా చెప్పలేక రెండు భాగాలుగా నిర్మించారు. ఇదే కాదు, సాధారణంగా బయోపిక్‌లన్నింటికీ నిడివి ఎక్కువగానే ఉంటుంది. జీవిత కథ మొత్తం చెప్పాలంటే కచ్చితంగా ఎక్కువ సమయమే పడుతుంది.


 యాత్ర రెండు గంటలే

కానీ, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వస్తోన్న ‘యాత్ర’ చాలా తక్కువ నిడివితో తెరకెక్కడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించిన ‘యాత్ర’ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహి వి. రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, సీఎం పీటమెక్కి ప్రజల మన్ననలు పొందిన వైఎస్సార్ జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ‘యాత్ర’ సినిమా నిడివి చూస్తుంటే వైఎస్సార్ జీవితంలోని అన్ని విషయాలను ప్రస్తావించారా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ‘యాత్ర’ కేవలం 126 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తుందో. నిడివి చాలా తక్కువగా ఉంది కాబట్టి సినిమాను సూటిగా సుత్తిలేకుండా చెప్పారని అర్థమవుతోంది. కానీ, ఎంత సూటిగా చెప్పినా మరీ రెండు గంటల్లో మహానేత జీవితం ఎలా చెప్తారు అనే అనుమానం కలగకమానదు. అయితే, ‘యాత్ర’ అని టైటిల్ పెట్టారు కాబట్టి కేవలం వైఎస్సార్ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి ఎలా వచ్చారో మాత్రమే చూపిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా, రెండు గంటల ఆరు నిమిషాల్లో సినిమాను పూర్తి చేయడం అంటే సవాలుతో కూడుకున్నపనే. ఇంత తక్కువ నిడివిలో సినిమాను ఎలా తెరకెక్కించారు.. అసలు ఇందులో ఉన్న విషయం ఏమిటి తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. 

No comments:

Post a Comment