300 కిలోమీటర్లే ఫుట్ పాత్
హైద్రాబాద్, ఫిబ్రవరి 16, (way2newstv.in)
హైద్రాబాద్ నగరంలో పాదచారులు రాకపోకలు ప్రశ్నార్థకంగా, ప్రమాదకరంగా మారాయి. కనీసం పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన ఫుట్పాత్లు అందుబాటులో లేవు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ల పరిరక్షణ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికపుడు విఫలమవుతూనే ఉన్నారు. మహానగరంలో సీసీ, బీటీ రోడ్లు కలిపి సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల పొడువున రోడ్లున్నా, కేవలం 300 కిలోమీటర్ల పొడువున మాత్రమే ఫుట్పాత్లు ఉన్నాయి. ఇండియన్ రోడ్డు కౌన్సిల్(ఐఆర్సీ) నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమేనన్న వాదనలు ఉన్నాయి. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు వేల కిలోమీటర్ల పొడువున బీటీ రోడ్లు, మరో మూడు వేల కిలోమీటర్ల పొడువున సీసీ రోడ్లు ఉన్నాయి.
. 9 వేల కిలోమీటర్ల రోడ్లు...
వీటిపై ప్రతిరోజు సుమారు 50లక్షల అన్ని రకాల వాహానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి తోడు రోజురోజుకీ పెరిగిపోతున్న రద్దీ, వాహనాల సంఖ్యను బట్టి నగరానికి కనీసం 10వేల కిలోమీటర్ల ఫుట్పాత్లు అవసరం కాగా, ఎప్పటికపుడు అవసరానికి తగిన విధంగా రోడ్లను విస్తరించటం, కొత్త రోడ్లను నిర్మిస్తున్న బల్దియా ఫుట్పాత్ల ఏర్పాటు విషయంలో వహిస్తున్న నిర్లక్ష్యంతో పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.రోడ్డు నిర్మాణం, ఫుట్పాత్ల ఏర్పాటు వంటి అంశాల్లో జీహెచ్ఎంసీ పూర్తిగా ఐఆర్సీ నిబంధనలను ఉల్లంఘించినా, కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. వీటిలోనూ అత్యధిక భాగం చిన్నాచితక వ్యాపారులు ఆక్రమించుకుని ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ టాయిలెట్లను నిర్మించటం, మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మరను నిర్మించింది. నగరంలో వేల కిలోమీటర్ల పొడువున ఉన్న రోడ్లకు తగ్గట్టుగా, రోజురోజుకీ పెరిగిపోతున్న పాదచారుల సంఖ్యకు అనుకూలంగా ఫుట్పాత్లు అందుబాటులో లేవని కొంతకాలం క్రితం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటైన ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ విభాగం ఆరంభంలో శూరత్వం అన్నట్టు ఏర్పాటైన కొంతకాలంలోనే ఏకంగా 15వేల ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించినట్లు ప్రకటించుకుంది. చిన్నాచితక వ్యాపార సంస్థలను తొలగించి ఆ విభాగం ప్రతాపం ప్రదర్శించుకుంది. కానీ, అక్రమ నిర్మాణాలు, భవనాల విస్తరణ, వాహానాల పార్కింగ్, పబ్లిక్ టాయిలెట్లు, వాటర్ ఏటీఎంలు, పోలీసు ఔట్పోస్టులు వంటివి ఏర్పాటైనా బల్దియా విజిలెన్స్ అధికారులు వాటిని తొలగించకుండా, పిచ్చుకలపై బ్రహ్మస్త్రం అనే చందంగా చిన్నాచితక వ్యాపారులను తొలగించి, చేతులు దులుపేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తొలగిస్తున్న కొద్దీ మళ్లీ ఆక్రమణలు వెలుస్తున్నాయి.బల్దియా రోడ్లను నిర్మిస్తున్నా, నిర్మాణంలో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనలను అమలు చేయటం లేదు. బల్దియా వద్దనున్న లెక్కల ప్రకారం మీటర్ వెడల్పుతో ఉన్న ఫుట్పాత్లు సుమారు 30 కిలోమీటర్ల పొడువు ఉండగా, మీటరు వెడల్పు ఉన్న ఫుట్పాత్ 146 కిలోమీటర్ల వరకు, రెండు మీటర్ల వెడల్పు కల్గిన ఫుట్పాత్లు 120 కిలోమీటర్లు, రెండున్నర మీటర్ల వెడల్పు ఉన్న ఫుటపాత్లు 107 కిలోమీటర్లు ఫుట్పాత్లు ఉన్నాయి. కానీ, ఐఆర్సీ నిబంధనల ప్రకారం అత్యంత జనం సంచారం ఎక్కువగా ఉండే వ్యాపార సంస్థలున్న ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా నాలుగు మీటర్ల వెడల్పుతో, దుకాణాల ముందు మూడున్నర నాలుగున్నర మీటర్ల వెడల్పు, బస్టాపుల్లో మూడు మీటర్లు, కమర్షియల్తో పాటు మిక్స్డ్ ఏరియాల్లో రెండున్నర మీటర్లు, ఎలాంటి అడ్డంకులు లేకుండా పాదచారులు నడిచేందుకు వీలుగా 1.08 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్లు ఉండాలంటూ ఐఆర్సీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినా బల్దియా పాటించటం లేదు.
No comments:
Post a Comment