మెదక్, ఫిబ్రవరి 16, (way2newstv.in)
సుదీర్ఘకాలంగా చర్చల్లో నలుగుతున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తేదీ ఎట్టకేలకు ఖరారు అయింది. సీఎం కేసీఆర్ ఫిభ్రవరి 19న ముహూర్తం పెట్టారు. మాఘశుద్ధపౌర్ణమి మంచి రోజు కావడంతో ఆ రోజు ఉదయం 11.30గంటలకు రాజ్భవన్ లో ఈ కార్యక్రమం ఉండనుంది. ఎవరెవరు ఆ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు బెర్తుల కోసం ఉబలాటపడుతున్నారు.అయితే, కేబినెట్లో 8 నుంచి పది మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. పేర్లు మాత్రం వెల్లడి కాలేదు.
హరీష్ కు ఛాన్స్ ఉందా...లేదా
ఇందులో ప్రధానంగా గత కేబినెట్ లో కీలక పదవుల్లో ఉన్న కేటీఆర్, హరీశ్ రావుపై అందరి చూపు పడింది. ఈ ఇద్దరి భవిష్యత్ను నిర్దేశించేలా కేసీఆర్ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు.తన వారసుడిని ప్రమోట్ చేసే ఎత్తుగడలో భాగం అన్నట్లుగా కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను గులాబీ దళపతి కేసీఆర్ అప్పగించారు. ఆయన హయాంలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్ కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. తన మేనల్లుడు హరీశ్ రావు విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటరనే చర్చ కూడా తెరమీదకు వస్తోంది. హరీశ్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి పార్టీ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. అదే విధంగా హరీశ్ రావు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువనేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక ప్రస్తుత పదవుల వరకే పరిమితం చేస్తారా అనే చర్చనీయాంశం అయ్యింది.కాగా, తనయుడు, మేనల్లుడు విషయంలో కేసీఆర్ మదిలో ఏముందనే విషయం ఇప్పటివరకు పార్టీ నేతలు ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అలా అని అధినేతను అడిగే ధైర్యం అంతకంటే చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కీలక ప్రశ్నలకు.. 19వ తేదీ జరిగే కేబినెట్ విస్తరణలో సమాధానం దొరకనుంది. వారిద్దరి భవిష్యత్పై స్పష్టత రానుంది.
No comments:
Post a Comment