Breaking News

23/08/2018

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా

న్యూఢిల్లీ, ఆగస్టు 23, (way2newstv.in)
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. నాలుగో రోజు 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో రహీ జీవన్ సర్నోబత్ (27) భారత్‌కు మరో స్వర్ణం అందించింది. తుది పోరులో థాయ్‌లాండ్ షూటర్ నెఫాస్వాన్ యాంగ్‌పాయ్‌బూన్ నుంచి గట్టి పోటీ ఎదురైనా నిలకడా రాణించిన రహీ రికార్డు స్కోరుతో స్వర్ణం పతకం దక్కించుకుంది. దీంతో ఏషియాడ్‌లో భారత్ పతకాల సంఖ్య పదకొండుకు చేరింది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ మను భాకర్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 2014 ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన రహీ, ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా స్వర్ణం ఒడిసిపట్టింది. అర్హత రౌండ్‌లో షూటర్ మనూ భాకర్ 593 పాయింట్లతో రికార్డు స్కోరు సాధించి ఫైనల్‌కు చేరుకోగా, రహీ 580 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవడం విశేషం. 



ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో స్వర్ణం సాధించేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యాంగ్, కొరియా షూటర్ కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక 2010,2014 కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం గెలుపొందింది. అంతకు ముందు యువ షూటర్ మనూ భాకర్ ప్రెసిషన్‌లో 297 పాయింట్లు, ర్యాపిడ్‌లో 296 పాయింటు సాధించి ఒక్క పాయింట్‌తో ప్రపంచ రికార్డుకు దూరంలో నిలిచిపోయింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో భాకర్, అభిషేక్ వర్మలు పేలవమైన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు అపూర్వీ చండేలా-రవి కుమార్ జోడి కాంస్యంతో భారత్‌కు తొలి పతకాన్ని అందించగా.. రెజ్లర్ భజరంగ్ పసిడి పతాకాన్ని గెలుపొందాడు. మరో షూటర్ దీపక్ కుమార్ రెండో రోజు రజత పతకం గెలుపొందాడు. మూడో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల సౌరభ్ చౌధురీ స్వర్ణం గెలవగా.. మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యం సాధించాడు. 240.7 పాయింట్లతో సౌరభ్ ఏషియాడ్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 

No comments:

Post a Comment