హైద్రాబాద్, ఆగస్టు 17, (way2newstv.in)
ఎన్ని ట్విస్టులో.. ఎన్ని విమర్శలో.. ఎన్ని ఆరోపణలో.. ఎన్ని సందేహాలో.. ఎన్ని ప్రశ్నలో.. ఎక్కడా ఎవరూ తగ్గట్లేదు. ఎవరికి వారు బయట పడట్లేదు..! నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. ఎవరు పొత్తుల విషయంలో మొదటి ముందడుగు వేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి ఒక క్లారిటీ ఇవ్వకపోయినా.. అటు ఢిల్లీలో ఇటు ఏపీలో జరుగుతున్న, నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఒక అస్పష్టమైన క్లారిటీని మాత్రం ఇస్తున్నాయి. పొత్తు మాత్రం దాదాపుగా ఖరారు అయినా.. దీనిని మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. పొత్తులపై రాజకీయ కసరత్తులు చేస్తున్నాయి.ప్రస్తుతం టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య బంధం ఉందనే దిశగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యనించారు.
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుల ట్విస్ట్లు
అటు సీఎం చంద్రబాబు, ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే ఒక్క మాట స్పష్టం చేస్తున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే రాజకీయ పొత్తులు ఉంటాయి అంటూ ఇద్దరూ ఒకటే చెబుతున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం తర్వాత.. టీడీపీ-కాంగ్రెస్ మధ్య మైత్రికి బలమైన పునాదులు పడ్డాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తర్వాత పార్లమెంటులో కాంగ్రెస్-టీడీపీ నేతల వ్యాఖ్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ మీటింగ్లో తీర్మానించడం వంటివి కీలకంగా మారాయి.ఇరు పార్టీల రాజకీయ అవసరాల దృష్ట్యా పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఏపీలో చంద్రబాబుకు ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని తెలిసిందే! ప్రస్తుతం స్నేహితులందరూ దూరమైన తరుణంలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బద్ద శత్రువైన కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధమనే సంకేతాలిస్తున్నారు! ఇదే తరుణంలో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జతకట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని ఖండించకుండా.. వాస్తవమేనన్నట్లుగా ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు.ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై అధిష్టానందే తుది నిర్ణయమన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ దుష్ట పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనికి అనుగుణంగానే రాహుల్ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో సంకీర్ణయుగం నడుస్తోందన్నారు.అవినీతి ఎమ్మెల్యేలకు టీడీపీ సీట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని టీడీపీ పొత్తును పరోక్షంగా ప్రస్తావించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు రావాలంటూ పిలుపునిస్తున్నారు. మరి ఇరు పార్టీల నేతలు.. ఒకేలా వ్యవహరించడం ఇప్పుడు పొత్తులపై మరింత క్లారిటీ ఇచ్చేలా ఉంది.
No comments:
Post a Comment