Breaking News

29/01/2020

సూపర్ ఓవర్ తో ఇండియా గెలుపు. :సిరీస్ కైవసం

న్యూజిలాండ్, జనవరి 29, (way2newstv.in)
న్యూజిలాండ్ గడ్డపై భారత్ జట్టు తొలిసారి టీ20 సిరీస్‌ని గెలిచింది. హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 179 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కూడా 179/6కే పరిమితమైంది. దీంతో.. స్కోర్లు సమమవడంతో సూపర్ ఓవర్‌ని నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్.. 17 పరుగులు చేయగా.. ఛేదనలో రోహిత్ శర్మ చివరిగా రెండు బంతుల్నీ వరుసగా సిక్సర్లుగా మలిచి భారత్‌ని గెలిపించాడు. దీంతో.. ఐదు టీ20ల సిరీస్‌ని రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ 3-0తో చేజిక్కించుకుంది. టి20 క్రికెట్లోని అసలు సిసలు మజా ఏంటో హామిల్టన్ లో టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆవిష్కృతమైంది. 
సూపర్ ఓవర్ తో ఇండియా గెలుపు. :సిరీస్ కైవసం

మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీయగా, చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 179 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. ఆపై 18 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీ పోరాటపటిమ చూపించడం మ్యాచ్ భారత్ వశమైంది. రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (65: 40 బంతుల్లో 6x4, 3x6) హాఫ్ సెంచరీ బాదడంతో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది. కేఎల్ రాహుల్ (27), కెప్టెన్ విరాట్ కోహ్లీ (38) ఫర్వాలేదనిపించినా.. దూకుడుగా ఆడలేకపోయారు. కానీ.. చివరి ఓవర్‌లో మనీశ్ పాండే (14 నాటౌట్: 6 బంతుల్లో 1x4, 1x6), రవీంద్ర జడేజా (10 నాటౌట్: 5 బంతుల్లో 1x6) చెరొక సిక్స్ బాది 18 పరుగులు రాబట్టడంతో భారత్ జట్టు 179 పరుగుల స్కోరైనా చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెనెట్ మూడు, శాంట్నర్, గ్రాండ్‌హోమ్ చెరొక వికెట్ పడగొట్టారు.180 పరుగుల లక్ష్య ఛేదనని న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31: 21 బంతుల్లో 2x4, 3x6), కొలిన్ మున్రో (14: 16 బంతుల్లో 2x4) దూకుడుగా ఆరంభించారు. తొలి వికెట్‌కి 5.4 ఓవర్లలోనే 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ఓవర్ వ్యవధిలో శార్ధూల్ ఠాకూర్, జడేజా పెవిలియన్ బాట పట్టించినా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95: 48 బంతుల్లో 8x4, 6x6) భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో.. చూస్తుండగానే భారత్‌కి మ్యాచ్ చేజారుతున్నట్లు కనిపించింది. శార్ధూల్ ఠాకూర్, జడేజా బౌలింగ్‌ని లక్ష్యం చేసుకుని సిక్సర్లు బాదిన విలియమ్సన్.. ఆఖరికి షమీ, బుమ్రాని కూడా వదల్లేదు. మరోవైపు భారత ఫీల్డర్ జడేజా ఓ క్యాచ్‌ని వదిలేయగా.. శార్ధూల్ ఠాకూర్, శివమ్ దూబే ఫీల్డింగ్ తప్పిదాలకి పాల్పడ్డారు.న్యూజిలాండ్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరంకాగా.. మహ్మద్ షమీ 8 పరుగులిచ్చి విలియమ్సన్, టేలర్‌ని ఔట్ చేశాడు. దీంతో.. న్యూజిలాండ్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో విలియమ్సన్ ఒక ఫోర్, సిక్స్ బాదగా.. గప్తిల్ కూడా ఓ ఫోర్ కొట్టేశాడు.సూపర్ ఓవర్ ఛేదనలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కిరాగా.. టిమ్ సౌథీ బౌలింగ్‌కి వచ్చాడు. దీంతో.. తొలి రెండు బంతులకీ రోహిత్ మూడు పరుగులే రాబట్టగా.. మూడో బంతికి ఫోర్ బాదిన రాహుల్.. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో.. చివరి రెండు బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. భారత్ శిబిరంలో ఒకటే కాంగారు.. కానీ.. ఆ రెండు బంతుల్నీ రోహిత్ శర్మ వరుసగా 6, 6గా మలిచేశాడు. దీంతో.. భారత్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.

No comments:

Post a Comment