Breaking News

09/01/2020

అందరికి ప్రతీష్టాత్మకమే... ఢిల్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ, జనవరి 9  (way2newstv.in)
ఎన్నికలకు అంతా సిద్ధమయింది. వచ్చే నెల 8వ తేదీన పోలింగ్. ఇంకా ఢిల్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఢిల్లీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించాలని యోచిస్తుంది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. గత ఐదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరును ప్రధానంగా ప్రజల ముందు ఎండగట్టనున్నారు.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు అనూహ్యంగా 67 స్థానాలను కట్టబెట్టారు. బీజేపీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా హర్యానా రాష్ట్రంలో బలోపేతం కావడంతో ఢిల్లీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటే అవకాశాలున్నాయి.
అందరికి ప్రతీష్టాత్మకమే... ఢిల్లీ ఎన్నికలు

ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీస్తే తమ విజయం ఖాయమని బీజేపీ భావిస్తుంది. గత ఐదేళ్లలో ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కాదని ఏమీ చేయలేకపోయింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ మరో నాలుగున్నరేళ్ల పాటు ఉండనండటంతో ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ వైపునకు మొగ్గు చూపుతారని బీజేపీ భావిస్తుంది. లెఫ్ట్ నెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య వివాదాన్ని చర్చనీయాంశం చేయనుంది. ఢిల్లీలో ప్రభుత్వం సజావుగా సాగాలన్నా, సమస్యలు తీరాలన్నా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ తప్ప వేరే మార్గం లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేసిందిఅమిత్ షా ఢిల్లీ ఎన్నికలపై పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పౌరసత్వ చట్ట సవరణ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని షా సూచించారు. అలాగే టిక్కెట్ల కేటాయింపుపై బూత్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. కులాల వారీగా, మతాల వారీగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా పంజాబీల ఓట్ల కోసం ప్రత్యేక కార్యచారణను రూపొందించారు. ముక్కోణపు పోటీలో విజయం తమదేనన్న ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది.

No comments:

Post a Comment