Breaking News

12/12/2019

రీల్ లైఫ్ లో వీడియో గేమ్స్...

అందుకే ప్రమాదం
హైద్రాబాద్, డిసెంబర్ 12 (way2newstv.in)
పెద్ద పెద్ద భవంతులు, ఆకాశ హార్మ్యాలు.. వాటి మధ్య రయ్ రయ్ అంటూ వేగంతో దూసుకెళ్లే కార్లు, బైక్‌లు.. మధ్యలో ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లు.. ఊహించని టర్నింగ్‌లు, శత్రువుల దాడి.. వీటన్నింటినీ వీడియో గేమ్స్‌లో చూస్తుంటాం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కారణమైన కారు కూడా వీడియో గేమ్‌లో చూసిన విధంగానే దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కీలకమైన విషయం ఏమిటంటే.. ఆ కారు నడిపిన వ్యక్తి కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు కూడా వీడియో గేమ్స్‌ రూపొందించే ఓ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కావడం.నిత్యం వీడియో గేముల రూపకల్పనలో తలమునకలయ్యే వ్యక్తి.. నిజ జీవితంలోనూ అదే తీరున కారు నడపడం వల్లే ఈ విషాదం జరిగిందనేది నిపుణుల అభిప్రాయం. 
రీల్ లైఫ్ లో వీడియో గేమ్స్......

అయితే.. ప్రమాద సమయంలో తాను 40 కిలీమిటర్ల వేగంతోనే ఉన్నానని, ఫ్లైఓవర్ డిజైనే ప్రమాదానికి కారణమని కృష్ణమిలన్ రావు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. అతడిని అరెస్టు చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ప్రమాద సమయంలో కృష్ణమిలన్ రావు నడుపుతున్న వోక్స్‌వ్యాగన్ పోలో కారు 104 కిలోమిటర్ల వేగంతో ఉందని పోలీసులు వివరాలు సమర్పించారు.అత్యాధునిక సాంకేతికతతో వీడియో గేమ్స్ రూపొందించే వ్యక్తుల ఆలోచనలు నిజ జీవితంలోనూ అంతే వేగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ తరహా వ్యక్తులు నిత్యం అలాంటి ఆటల ధ్యాసలో ఉండటం సాధారణమని.. ఈ క్రమంలో వారు చేసే పనులు కూడా అంతే త్వరగా పూర్తవ్వాలని భావిస్తారని వివరిస్తున్నారు. అందుకే.. ప్రమాదానికి కారణమైన కల్వకుంట్ల కృష్ణమిలాన్‌ రావు కూడా అంత వేగంతో దూసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.ఘటన జరిగిన తీరు గమనించినా.. ఇదే అంశం స్పష్టమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో కృష్ణమిలాన్‌ రావు అత్యవసరంగా వెళ్లాల్సి ఉంది. అతడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే రెడ్ సిగ్నల్‌ పడింది. అతడిలో వెళ్లాలనే ఆతృత ఇంకా పెరిగింది. గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే ముందు వరుసలోనే ఉన్న తన కారును ఒక్కసారిగా ముందుకు ఉరికించాడు. ముందర ఫ్లైఓవర్ కనిపించగానే అతడితో ఉత్సాహం మరింత పెరిగింది. అతడికి సిగ్నల్‌ పడకముందు వెళ్లిన నాలుగైదు వాహనాలను కూడా దాటుకుంటూ బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లాడు.ఫ్లైఓవర్ ఎక్కగానే కృష్ణమిలాన్‌ రావు తన ఫోక్స్‌వ్యాగన్‌ పోలో కారును గాల్లోకి లేపాడు. వీడియో గేమ్స్‌లో చూసినట్లు కుడి, ఎడమనున్న ఆకాశహర్మ్య్వాలను చూస్తూ అంతే వేగంలో నిర్లక్ష్యంగా ముందుకు సాగాడు. గంటకు 104 కి.మీ. వేగంతో ఉన్న కారు ఒక్కసారిగా మలుపు దగ్గరికి చేరుకుంది. అతడు దాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టి అమాంతం కిందనున్న రోడ్డుపై పడిపోయి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వేచి చూస్తున్న సత్యవేణి అనే మహిళపై ఆ కారు అమాంతం పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొంత మంది షాక్‌కు గురయ్యారు.ఈ కేసులో చిక్కులు ఎదురవకుండా కృష్ణమిలాన్‌ రావు ఆది నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసిన కృష్టమిలాన్‌ రావు ప్రమాదం జరిగిన వెంటనే ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాగ్రాం తదితర సోషల్ మీడియా ఖాతాలను తొలగించాడు. ఫ్లైఓవర్ డిజైన్‌లో లోపాలను అనుకూలంగా మార్చుకొని తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేలా అడుగులు వేస్తున్నాడు. లాయర్ ద్వారా హైకోర్టులో సాంకేతిక అంశాల ద్వారా ఉపశమనం పొందాడు. అయితే.. ఇది తాత్కాలిక ఉపశమనమే కావొచ్చు. పోలీసులు ఇవే టెక్నికల్ అంశాల ద్వారా అతడు ఎంత వేగంతో దూసుకెళ్లాడో నిరూపించే అవకాశం ఉంది.బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంతో హైదరాబాదీలు ఉలిక్కిపడ్డారు. నవంబర్ 4న ఈ వంతెన ప్రారంభం కాగా.. కేవలం 20 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఫ్లైఓవర్ ప్లానింగ్ సరిగా లేదని సివిల్ ఇంజనీర్లు, రోడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్‌ చెప్పారు. ‘ఫ్లైఓవర్ నిర్మాణం దృఢంగా, మన్నికగా ఉంది. కానీ డిజైన్ తీసికట్టుగా ఉంది. తిన్నగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ పెంచడం, తగ్గించడం వల్ల వాహన స్థిరత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. కానీ, మలుపు వద్ద వాహనం స్పీడ్‌గా వెళ్తే.. అపకేంద్ర బలం వల్ల వాహనం బయటి వైపు వెళ్తుంది. స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాహనం స్కిడ్ అయ్యే రిస్క్ ఉంది’ అని ప్రొఫెషనల్ బాడీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వరల్డ్ కాంగ్రెస్-ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్పీ అంచూరీ తెలిపారు.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలు జరగటానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని కారణాలు గుర్తించారు. అవి:
1) వంతెనపై కనీస అవగాహన లేకపోవడం.
2) అతివేగం, మలుపుల దగ్గరికి రాగానే ఆందోళనకు గురవడం.
3) ఫ్లైఓవర్ పైనుంచి నగర సౌందర్యం చూస్తూ డ్రైవింగ్‌పై పట్టుతప్పడం.
ఫ్లైఓవర్ మీద S లాంటి మార్గాలు ఒకదాని వెంట ఒకటి రెండున్నాయి. ఇలా మలుపు ఉన్న చోట తప్పకుండా ట్రాన్సిషల్ జోన్ ఉండాలి. కానీ, ఇక్కడ అది లేదని డాక్టర్ అంచూరీ తెలిపారు. మలుపులు ప్రమాదకరంగా ఉండటమే కాదు.. రక్షణ గోడ ఎత్తు కూడా పెంచాలని సూచించారు.ప్రమాదం అనంతరం ఫ్లైఓవర్‌ను మూసేశారు. వంతెనపై వాహన వేగాన్ని 40 కి.మీ. తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 మీటర్లకు ఒకటి చొప్పున రంబుల్‌ స్టిప్స్‌ను (తెల్లని మందమైన గీతలు) ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లైఓవర్‌కు రెండువైపులా మలుపు ప్రాంతంలో క్రాష్‌ బారియర్‌ రోలర్స్‌ ఏర్పాటు చేయాలని, రెయిలింగ్‌ ఎత్తును పెంచాలని భావిస్తున్నారు. ప్రమాదాల నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే తిరిగి వాహనాలను అనుమతిస్తారు

No comments:

Post a Comment