Breaking News

24/12/2019

సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి

జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
ములుగు డిసెంబర్ 24 (way2newstv.in)  
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుటకు ప్రాణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతర నిర్వహణ, రామప్ప ఆలయ అభివృద్ధి, జనవరి 2 నుండి ప్రారంభమయ్యే రెండో విడత 30 రోజుల ప్రణాళిక అమలు తన ముందు ఉన్న తక్షణ ప్రాధాన్యత అంశాలని ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. 
సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి

మేడారం జాతర అభివృద్ధి పనులు వేగవంతం చేసి, సివిల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. తాత్కాలిక పనులు చేపట్టి, జనవరి 15 కల్లా పూర్తి చేసి, భక్తులకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రామప్ప దేవాలయం గొప్ప వారసత్వ సంపద అని, అభివృద్ధి పనులు ముమ్మరం చేసి సమగ్రంగా అభివృద్ధి పరచాలని అన్నారు.  ఇటీవలే యునెస్కో బృందం రామప్పను సందర్శించిందని, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలుపై జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ దశ దిశా నిర్దేశం చేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని, గ్రామాల అభివృద్దే దేశాభివృద్దని అన్నారు. పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment