Breaking News

11/12/2019

గజ్వేల్‌కు వచ్చే ఏడాది నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు: కేసీఆర్‌

సిద్దిపేట డిసెంబర్ 11 (way2newstv.in)
గజ్వేల్‌ నియోజకవర్గానికి వచ్చే ఏడాది జనవరి నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. పతీ చెరువు, కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుందని సీఎం తెలిపారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌లో అడవులను పునరుద్ధరిస్తున్నాం. గజ్వేల్‌ను పచ్చగా చేయాలనుకున్నాం. చేసి చూపించాం.
గజ్వేల్‌కు వచ్చే ఏడాది నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు: కేసీఆర్‌

నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లే. గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించింది. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సీఎం స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి. ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలి. నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. దేశాన్ని, రాష్ర్టాన్ని ఆర్థికమాంద్యం పట్టిపీడిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదు. ఏ గ్రామంలో ఏముంది.. ఏం కావాలి అనే విషయంపై అవగాహన రావాలి. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరికి కథానాయకుడు కావాలి. ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్‌ కావొద్దు. ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలి. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాళ్లెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం. మహతి ఆడిటోరియం నుంచి నలు దిశలా వెలుగులు ప్రసారించాలని తన కోరిక. ఈ హాల్‌కు మహతి అనే పేరు తానే పెట్టాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సంగీతంలో ఆరితేరిన వారు నారదుడు, తుంబురుడు. నారద మహర్షి వాయించే వీణ పేరు మహతి. జిల్లా కేంద్రాల్లో ఇలాంటి హాళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ ఉంటుంది. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రక్రియను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నాను అని సీఎం తెలిపారు. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. గజ్వేల్‌ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలి. దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలి. త్వరలోనే గజ్వేల్‌ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. గజ్వేల్‌ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment