Breaking News

27/12/2019

ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం: కేటీఆర్‌

విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉంది.
ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోంది.
హైదరాబాద్‌ డిసెంబర్ 27 (way2newstv.in)          
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. కొత్తగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చాం. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించాం. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉంది. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోంది. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని' పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 
ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం: కేటీఆర్‌

సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.'మేము నేల విడిచి సాము చేయడం లేదు. ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ మాకు కట్టబెట్టారు. 2014లో 63 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌..2018లో 88సీట్లలో గెలిచింది. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నాం. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చిన తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చాం. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతాం. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించాం. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాం. 95శాతం పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని' మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment