Breaking News

04/11/2019

ప్లాన్ బీ అమలు దిశగా కమలం

హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.in)
ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలి. ఇదే ఇప్పుడు బిజెపి తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్త గతం చేసుకునే ప్లాన్ అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో బలంగా ఉన్న కేసీఆర్, జగన్ లను తమ ప్లాన్ అమలుతో దిమ్మతిరిగేలా చేయొచ్చని బిజెపి పథక రచన మొదలు పెట్టిందంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ కు అక్షయపాత్ర గా వున్న హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది కాషాయదళం ఆలోచన అంటున్నారు. తెలంగాణ లోని 35 శాతం హైదరాబాద్ తో చేర్చి యు.టి చేస్తే టీఆర్ఎస్, వైసిపి, మజ్లిస్, టిడిపి ల ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని బిజెపి భావనగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్,బిజెపి తమకు ద్రోహం చేశాయని విభజన తరువాత బలంగా విశ్వసిస్తున్నారు. 
ప్లాన్ బీ అమలు దిశగా కమలం

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ తెలంగాణ కు వెళ్లడం తో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర సమస్యలు ఏర్పడటంతో బాటు బలమైన ఆర్ధిక సంపత్తి భాగ్యనగరానికి చెందడం పట్ల ఈ రెండు జాతీయ పార్టీలకు సమదూరం పాటిస్తున్నారు. మరోపక్క కేసీఆర్ హైదరాబాద్ ఆర్ధిక అండ చూసుకునే రెండు తెలుగు రాష్ట్రాల్లో తన హవా నడిచేలా సాగడం గత ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారన్నది బిజెపి గుర్తించింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అటు గులాబీ పార్టీకి ఇటు ఫ్యాన్ పార్టీకి ఫీజ్ పీకేయొచ్చని ఎత్తుగడ వేస్తున్నట్లు ఈ వైరల్ అవుతున్న న్యూస్. అదే జరిగితే హైదరాబాద్ లేని మిగిలిన ప్రాంతం ఆంధ్రా తో ఆర్ధికంగా సమానం అవుతుందని విద్యా ఉద్యోగ అవకాశాలు అందరికి ఒకేలా ఉంటాయి కనుక ఎపి యువత తమ పార్టీ పట్ల సానుకూలంగా మారడంతో బాటు భాగ్యనగర్ లోని బలమైన ఆర్ధిక సంపన్నులు కేంద్రం కనుసన్నల్లో ఉంటారని ఇందులో పేర్కొనడం విశేషం. తమ ప్లాన్ వర్క్ అవుట్ అయితే దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల నుంచే బిజెపి జైత్ర యాత్రకు బీజం పడుతుందని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారట.కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను యుటి చేస్తే కేసీఆర్ కి మరో బ్రహ్మాస్త్రం చిక్కినట్లే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ సెంటిమెంట్ తో బాటు హైదరాబాద్ లేని రాష్ట్రం మాకోద్దంటూ గతంలో గులాబీ బాస్ కాంగ్రెస్ పెద్దల ముందు పంచాయితీ పెట్టిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. కేంద్ర మంత్రిగా వున్న చిరంజీవి నాడు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం గా మార్చాలంటూ డిమాండ్ చేసినా కేసీఆర్ కోరికనే కాంగ్రెస్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తలకాయను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కేసీఆర్ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఇంకోసారి అధికారం సాధించడం ఖాయమని విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment