Breaking News

15/10/2019

మహారాష్ట్రలో కాషాయ కలవరం

ముంబై, అక్టోబరు 15 (way2newstv.in)
అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమిలకు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. ఎంత బుజ్జగించినా అసంతృప్తులు దారికి రావడం లేదు. ముఖ్యంగా బీజేపీ, శివసేనలకు పట్టున్న ప్రాంతాల్లోనే ఈ అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉంది. అసంతృప్త నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. దీంతో వారు చీల్చే ఓట్లు తమ విజయానికి ఎక్కడ గండికొడుతుందోనన్న ఆందోళన బీజేపీ, శివసేనల్లో స్పష్టంగా కన్పిస్తుంది.మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో శివసేనకు చెందిన 26 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. రాజీనామాలు చేసి తమ నిరసనను తెలియజేశారు. కల్యాణ్ నియోజకవర్గం శివసేనకు పట్టుంది. అక్కడ పొత్తులో భాగంగా బీజేపీకి టిక్కెట్ కేటాయించారు. 
మహారాష్ట్రలో కాషాయ కలవరం

గణపత్ గైక్వాడ్ ను బీజేపీ బరిలోకి దించడంతో శివసైనికులు శివాలెత్తిపోయారు. తమ నేత ధనంజయ్ బొడారేకు మద్దతుగా కల్యాణ్-డోంబవలి కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు రాజీనామా బాట పట్టారు.ఇక థానే నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తుంది. ఇక్కడ శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. బీజేపీ అసంతృప్త నేతలను ఎంత బుజ్జగించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో శివసేన నుంచి బీజేపీ అధినాయకత్వానికి హెచ్చరికలు వెళ్లాయి. ఇలా రెండు పార్టీల్లో అసంతృప్తి బాగానే కన్పిస్తుంది. తమకు పట్టున్న ప్రాంతాలను వదిలిపెట్టుకునేందుకు శివసేన, బీజేపీలు రెండూ ససేమిరా అంటున్నాయి.మరోవైపు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం కూడా బీజేపీ, శివసేనల్లో చిచ్చురేపింది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ప్యారాచూట్ నేతలకు టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క ధానే జిల్లాలోనే దాదాపు రెండు వందలకు మందిపైగా పోటీలో ఉండటం విశేషం. కాంగ్రెస్, ఎన్సీపీలు పెద్దగా ప్రభావం చూపవని, మహారాష్ట్రను మరోసారి కైవసం చేసుకుంటామని ధీమాగా ఉన్న శివసేన, బీజేపీలకు రెబెల్స్ కలవరం రేపుతున్నారు. మరి చివరి నిమిషంలోనైనా వీరు దారికి వస్తారా? లేదా? అన్నది చూడాలి.

No comments:

Post a Comment