Breaking News

23/10/2019

కాంగ్రెస్ లో ప్రగతి భవన్ చిచ్చు

హైద్రాబాద్, అక్టోబరు 23 (way2newstv.in)
ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం టీకాంగ్రెస్‌లో మరోసారి కాక పెట్టినట్లు కనిపిస్తోంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల అభ్యర్థి విషయంలో పార్టీలో బయటపడ్డ లుకలుకలు.. ఆ ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత సమసిపోయినట్లే కనిపించినా.. రేవంత్ రెడ్డి నిర్ణయంతో మరోసారి తారాస్థాయికి చేరాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. సీనియర్‌ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు భేటీ అయ్యారు. 
కాంగ్రెస్ లో ప్రగతి భవన్ చిచ్చు

ఈ సందర్భంగా.. సోమవారం తలపెట్టిన ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నేతలెవరికీ సమాచారం ఇవ్వకుండా రేవంత్‌ రెడ్డి ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు ఇచ్చారని నాయకులు భట్టి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్‌ రెడ్డి ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి ప్రకటించారని నేతలు ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ముట్టడిలో పాల్గొనాలని మీడియాకు ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యం కల్గించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన వారిలో సీనియర్‌ నేతలు వి హనుమంతరావు, పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక టికెట్‌ విషయంలో ఎంపీ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ తన సతీమణి పద్మావతికి టికెట్‌ ఇవ్వాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రేవంత్‌ ప్రశ్నించారు. స్థానికులైన శ్యామల కిరణ్‌రెడ్డికి హుజూర్‌నగర్‌ టికెట్‌ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాసటగా నిలిచారు. రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ దిగిరాక తప్పలేదు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో తన సోదరి పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు.టీపీసీసీ పదవిపై కన్నేసిన రేవంత్ రెడ్డి.. ఆ దిశగా వేగంగా పావులు కదపడంతో టీకాంగ్రెస్‌లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. గడప దాకా వచ్చిన టీపీసీసీ పదవిని తనకు కాకుండా చేయడంతో రేవంత్ రెడ్డి ప్రతీకారంతో రగిలి పోతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈమధ్యే పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని కొంత మంది సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. యురేనియం అంశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌కు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించడం ఆ మధ్య పార్టీలో కలకలం రేపింది. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద టీకాంగ్రెస్‌లో ఉత్తమ్, రేవంత్ మధ్య మొదలైన కోల్డ్ వార్ ఇప్పట్లో సమసిపోయేట్లు కనిపించడంలేదు

No comments:

Post a Comment