Breaking News

26/09/2019

కాంగ్రెస్ నేతల భేటీ ఆంతర్యం ఏమిటీ

అనంతపురం, సెప్టెంబర్ 26, (way2newstv.in)
ముగ్గూరూ ఒకే పార్టీకి చెందిన వారు. కానీ అందులో ఒకరు రాజకీయాలకు పూర్తిగా దూరమయినట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయిక ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకూ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి తన సొంత ఊరిలోనే ఎక్కువగా ఉంటున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. వరసగా రెండు ఓటములు చవిచూడటంతో ఆయన రాజకీయాలకు దాదాపుగా దూరం అయ్యారు. జగన్ ప్రభుత్వంపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదు.ఇక మరోనేత కేవీపీ రామచంద్రరావు. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కూడా కొంతకాలంగా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
కాంగ్రెస్ నేతల భేటీ ఆంతర్యం ఏమిటీ

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొంత రాజకీయాల్లో సందడి చేసిన కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయడం లేదు. అలాగని ప్రశసంలు కూడా కురిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.మరోనేత ఉండవల్లి అరుణ్ కుమార్. ఈయన 2014 తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పారు.కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో ఆయన ఆపార్టీకి దూరంగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై విమర్శలు కురిపించడంలో ముందుండే వారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో చంద్రబాబు సర్కార్ ను ఇరకాటంలో పెట్టేశారు. అలాగని జగన్ ను వెనకేసుకు రాలేదు. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు.ఇప్పుడు ఈ ముగ్గురూ నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇంట్లో రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. రాజకీయాలకు అతీతంగా తాము కలిశామని చెబుతున్నప్పటికీ వీరి మధ్య ప్రధానంగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ పాలనపై వీరు ముగ్గురూ చర్చించారని చెబుతున్నారు. జగన్ కొంత దూకుడు తగ్గిస్తే బాగుటుందని వీరు అభిప్రాయపడినట్లు తెలుస్లోంది. జగన్ నిర్ణయాలు చంద్రబాబు పాజిటివ్ గా మార్చుకుంటున్నారని కూడా వీరు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ముగ్గురూ జగన్ పై ఇప్పటి వరకూ ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముగ్గురూ అత్యంత సన్నిహితులు కావడంతో వీరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments:

Post a Comment