Breaking News

19/08/2019

సుజన..భజనపైనే చర్చంతా

విశాఖపట్టణం, ఆగస్టు 19, (way2newstv.in)
పుట్టుకతో వచ్చిన బుద్ధులు అన్నట్లు…. సుజనా చౌదరి మాత్రం చంద్రబాబు భజన ఇంకా ఆపలేకపోతున్నారు. తాను భారతీయ జనతా పార్టీలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఫక్తు టీడీపీ నేతలా మాట్లాడుతున్నారు. సుజనా చౌదరి రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడటానికే సుజనా చౌదరి కేంద్రంలో అధికారంలోకి రెండోసారి వచ్చిన కమలం పార్టీలో చేరారన్నది అందరికీ తెలిసిందే.సుజనా చౌదరి కాషాయ పార్టీలో చేరకముందు హడావిడి చేసిన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. అంటే త్వరలోనే సుజనా చౌదరికి సచ్ఛీలుడనే ముద్ర కూడా పడిపోతుంది. 
సుజన..భజనపైనే చర్చంతా

వందల కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టిన కేసులు కూడా త్వరలోనే ఎగిరిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కేవలం రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసమే సైకిల్ గ్యాంగ్ ను కమలం పార్టీలో విలీనం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర నేతలు అప్పట్లో చెప్పుకొచ్చారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు ప్రాధాన్యత పెరుగుతుంది. వేదికపైనే కాదు అమిత్ షాతో అంతర్గత చర్చల్లో పాల్గొనే అవకాశమూ చిక్కుతోంది. దీంతో సుజనా చౌదరి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పై వ్యక్తిగత కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుందని సుజనా ఆరోపిస్తున్నారు. జగన్ వన్నీ తొందరపాటు నిర్ణయాలేనంటూ ఊరూ వాడా తిరిగి చెబుతున్నారు.సుజనా చౌదరి కాషాయ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీని వదిలేసి చంద్రబాబుకు రక్షణ గోడగానే నిలుస్తున్నారన్నది ఇప్పుడు బీజేపీలో కూడా విన్పిస్తున్న మాట. చంద్రబాబు భజన మానుకోవాలని ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు సుజనా చౌదరిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి వల్ల ఉపయోగం బీజేపీకి లేకపోగా, టీడీపీకి మాత్రం పుష్కలంగా లభిస్తుందని ఆ పార్టీ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరి సుజనా నోటికి హైకమాండ్ కళ్లెం వేస్తుందో? లేదో? చూడాలి.

No comments:

Post a Comment