Breaking News

22/08/2019

ముందే రానున్న చిన్నమ్మ

బెంగళూర్, ఆగస్టు 22, (way2newstv.in)
జయలలిత నెచ్చలి శశికళ త్వరలోనే విడుదల కానున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాలని అప్పట్లో కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. శశికళ ఇప్పటికే శిక్ష మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. జయలలిత మరణం అనంతరం తమిళనాడులో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత శశికళ జైలుకు వెళ్లారు.శిక్షాకాలం నాలుగేళ్లు ఉన్నప్పటికీ సత్ప్రవర్తన కారణంగా శశికళను ముందే విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈమేరకు ప్రభుత్వం కూడా అందుకు తగిన సంకేతాలను ఇచ్చింది. 
ముందే రానున్న చిన్నమ్మ

అయితే న్యాయస్థానం విధించిన జరిమానాను చెల్లిస్తేనే విడుదల అవుతారు. ఇప్పటికే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ శశికళతో చర్చలు జరిపారు. న్యాయస్థానం తీర్పు ప్రకారం చెల్లించాల్సిన పది కోట్ల రూపాయల జరిమానా గురించి వీరు చర్చించారు. శశికళను ఆమె సమీపబంధువులు వరసగా ములాఖత్ కావడం జరిమానా చెల్లింపు విషయంలోనేని తెలుస్తోంది.శశికళ డిసెంబరు లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. శశికళ వచ్చిన వెంటనే తమిళనాడు లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారతాయని భావిస్తున్నారు. చిన్నమ్మ కుటుంబం నుంచి అన్నాడీఎంకే పార్టీని లాగేసుకోవడంతో శశికళ సూచన మేరకు దినకరన్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి శశికళ 2021లో ఎన్నికలకు ముందు విడుదలవుతారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం భావించారు.అయితే ఆమె దాదాపు ఏడాది ముందుగానే విడుదలవుతుందని తెలియడంతో అన్నాడీఎంకే నేతలు కూడా అప్రమత్తమయినట్లే కన్పిస్తుంది. శశికళ బయటకు వస్తే పార్టీ నేతలు ఎవరూ వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జయలలిత మేనకోడలు దీప ఎంజీఆర్‌ అమ్మ దీప పెరవాయి పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. శశికళకు వస్తుందని తెలియగానే దీప పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశారు. శశికళకు ఏ మాత్రం పట్టుచిక్కనివ్వకూడదన్న ఆలోచనతో ఉన్నారు పళనిస్వామి, పన్నీర్ సెల్వం. మరి శశికళ వచ్చిన తర్వాత అన్నాడీఎంకే నుంచి ఎవరెవరు పార్టీని వీడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

No comments:

Post a Comment