Breaking News

27/08/2019

అన్న దాతల ఫించన్ పథకం పై కేంద్రం అడుగులు

నిజామాబాద్, ఆగస్టు 27, (way2newstv.in)
అన్నదాతలు వృద్దాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకోవడానికి కేంద్రం దృష్టిసారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల లాగా ఫించన్ ఉండని రైతులు.. వృద్దాప్యంలో ఏ పనిచేయలేక ఇబ్బందులు  పడుతుంటారు.  అలాంటి వాళ్ళని ఆదుకునేందుకు ఈ ప్రధాన మంత్రి మాన్ ధన్ యోజన పింఛన్ పథకం ఉపయోగపడుతుంది. ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 60 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించిన వారికి 61వ సంవత్సరం నుంచి ఏటా నెలకు 3 వేల రూపాయల పించన్ ఇస్తారు. ఈ పథకంలో చేరిన రైతు మద్యలో చనిపోతే … అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియంతోపాటు బోనస్  లేదా వడ్డీ కలిపి నామినీకి చెల్లిస్తారు. అలాగే నామినికి కూడా పాలసీ కొనసాగించేలా వెసులుబాటు ఉంది. నామినీ భార్యకు నెలకు 1500 రూపాయలు చెల్లిస్తారు.ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం పూర్తిగా సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. 
అన్న దాతల ఫించన్ పథకం పై కేంద్రం అడుగులు

వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 6 లక్షల 78 వేల మంది రైతులు ఉండగా… వారిలో నాలుగున్నర లక్షల మంది ఈ పాలసీకి అర్హులవుతారు. గతంలో కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కూడా అర్హులైన వారిని పరిణనలోకి తీసుకుంటారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రమే అర్హులు. అలాగే 18యేళ్ళ నుంచి 40 ఏళ్లు వయస్సున్న రైతులకు మాత్రమే అవకాశం ఉండగా… ప్రతి నెలా 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకూ ప్రీమియం చెల్లించవచ్చు.  వయస్సు బట్టి ప్రీమియం  పెరుగుతుంది. రైతులు కట్టే ప్రీమియంనకు సమానంగా అంతే డబ్బు ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ పథకంలో చేరిన రైతులు  ప్రీమియంను  నెల, మూడు నెలలు, ఆరు నెలలుగా ప్రీమియం చెల్లించవచ్చు. ఈ ప్రీమియం బ్యాంక్ ద్వారా ఆటోమేటిక్ గా కూడా జమ చేయొచ్చు. పెట్టుబడిసాయంగా కేంద్రం చెల్లించే మొత్తం నుంచి  ఈ పథకం కింద ప్రీమియంను కట్టుకోవచ్చు. రైతు 60యేళ్ళ లోపు చనిపోతే …అతని నామినీ కాల పరిమితి వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతినెలా నామినీకి 1500 రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ అధికారులుతెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరిన  రైతు, నామినీ ఇద్దరూ చనిపోతే ఆ డబ్బులను పెన్షన్ స్కీమ్ కు బదలాయిస్తారు. ఒక వేళ రైతు అతని నామిని  పెన్షన్  స్కీమ్ వద్దనుకుంటే అప్పటి వరకూ చెల్లించిన  ప్రీమియంను వడ్డితో కలిసి అందిస్తారు. అయితే కనీసం 5 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వృద్దాప్యంలో రైతులకు అక్కరకు వచ్చే ఈ స్కీమ్ పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

No comments:

Post a Comment