Breaking News

09/07/2019

జనవరినాటికి బెజవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్


విజయవాడ, జూలై 9(way2newstv.in)
జూన్ 12 2017న విజయవాడ వాసుల చిరకాల కల బెంజిసర్కిల్ ప్లై ఓవర్ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి, పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన జాతీయ రహదారి ఉండటం, నిత్యం ట్రాఫిక్ ఉండటంతో, పనులు ఎలా సాగుతాయో అనుకున్నారు. అయితే, పనులు మాత్రం, చాలా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అతి ముఖ్యమైన పనులు అన్నీ 50 శాతం పైన పూర్తయ్యాయి. షడ్యూల్ ప్రకారం అయితే జనవరి  నెలకు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావలి. అయితే, నవంబరులో పూర్తి చేయనున్నట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. దసరా రోజు నాటికి పూర్తి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది. అయితే, నవంబర్ నాటికి పూర్తి చేస్తామని, కాంట్రాక్టు సంస్థ చెప్తుంది.1450 మీటర్ల దూరం పైవంతెన నిర్మాణంలో 49 పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం గడ్డర్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం 240 గడ్డర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే 50 గడ్డర్లను ఏర్పాటు చేశారు. రాత్రిపూట ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంకిపాడు సమీపంలో ఫ్యాబ్రికేటెడ్‌ పనులు చేస్తున్నారు. 

 జనవరినాటికి బెజవాడ బెంజి సర్కిల్  ఫ్లైఓవర్

స్పాన్లు, గడ్డర్లను అక్కడ నిర్మాణం చేసి భారీ వాహనాలు, క్రేన్లతో వాటిని తరలించి అమరుస్తున్నారు. బెంజిసర్కిల్‌ దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద గడ్డర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో పిల్లర్‌ తల మీద ఐదు వంతున గడ్డర్లను ఏర్పాటుచేశారు. ఈ గడ్డర్లు కింద పడకుండా ,జారిపోకుండా ఉండటానికి కాంట్రాక్టు సంస్థ పటిష్ఠ చర్యలు తీసుకుంది. ఈ పనులు పూర్తయితే గడ్డర్లకు సపోర్టుగా ఉంచిన రాడ్లతో పాటు చెక్క దిమ్మెలను కూడా తొలగిస్తారు. ఆ తర్వాత నిలువు గడ్డర్ల మధ్యన క్రాస్‌ గడ్డర్ల పనులు చేపడతారు.నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి సర్కిల్‌ వరకు కూడా గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులలో ఈ పనులు కూడా పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు నుంచి ఐదవ నెంబర్‌ రూట్‌ దాటే వరకు పిల్లర్ల తలలపై గడ్డర్లను ఏర్పాటుచేస్తారు. ఐదవ నెంబర్‌ రూట్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల పనులు చేపడుతున్నారు కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత మిగిలిన గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. మధ్యలో బెంజిసర్కిల్‌ దగ్గర రెండు పిల్లర్ల నిర్మాణంపై కాంట్రాక్టు సంస్థ దృష్టి సారించాల్సి ఉంది. వీటి పనులు పూర్తి చేసే లోపే రమేష్‌ హాస్పిటల్‌ వరకు కూడా పిల్లర్లు పూర్తవుతాయి. ప్రస్తుతం బెంజిసర్కిల్‌కు ఒక వైపు ఎస్‌వీఎస్‌ జంక్షన్‌ వరకు ఫ్లై ఓవర్‌పై స్లాబ్‌ పనులు కూడా చేపడుతున్నారు. స్లాబ్‌ వేయటానికి వీలుగా ఐరన్‌ను తెప్పించారు. క్రాస్‌ గడ్డర్‌ కాంక్రీట్‌ పూర్తయిన తర్వాత నిలువు గడ్డర్లపై ఐరన్‌ ఫ్రేమింగ్‌ చేసి కాంక్రీట్‌తో స్లాబ్‌ పోస్తారు. ఒకవైపు నిర్మాణం శరవేగంగా పూర్తవుతుండగా.. మరోవైపు వంతెన ఇంకా ప్రతిష్టంభనలోనే ఉంది. దీనికి కేంద్రం నుంచి పరిపాలన అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం రావాల్సి ఉంది. త్వరలో టెండర్లను పిలవనున్నట్లు పీడీ వెల్లడించారు. రెండో దశ అంచనా వ్యయం రూ.110 కోట్లుగా నిర్థరించారు. ఒకవైపు పూర్తి చేసినా... చాలావరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment