Breaking News

06/07/2019

నవరత్నాలు, ఆరోగ్య శ్రేలే ప్రధానంగా జగన్ బడ్జెట్


విజయవాడ, జూలై 6(way2newstv.in)
వై.ఎస్. జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ిఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కసరత్తును ప్రారంభించారు. ఈ నెల 12వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలతో పాటు నవరత్నాల్లోని అంశాలను కూడా చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా అన్ని రంగాల వారూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం పెట్టబోయే బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలపై వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి వారితో భేటీ అయి బడ్జెట్ రూపకల్పన పై ఇటీవల చర్చించారు కొద్ది రోజులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. వీటిలో కూడా వై.ఎస్. జగన్ ఇచ్చిన హామీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకూ వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి.

నవరత్నాలు, ఆరోగ్య శ్రేలే ప్రధానంగా జగన్ బడ్జెట్

సుమారు రెండు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ అంచనాలు ఆర్థికశాఖ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 12వ తేదీన బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇక నవరత్నాలను అమలు చేయడానికే సుమారు 66 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇక వై.ఎస్.జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి కార్యక్రమానికి భారీగా బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. తమ పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఒక్క అమ్మఒడి పథకానికే నాలుగువేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి ఐదువేల కోట్లు, వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం ఏడు వేల కోట్ల, రూపాయలు పింఛన్లకు పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించనున్నారు.ఇక వైఎస్.జగన్ గట్టి హామీ ఇచ్చిన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి పెద్దయెత్తున నిధులు కేటాయించనున్నారు. ఆరోగ్య శ్రీ ని రాష్ట్రంలో పట్టిష్టంగా అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. దీన్ని మరింత మెరుగులు దిద్దేందుకు వై.ఎస్.జగన్ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించనున్నారు. కమిటీ సిఫార్సుల మేరకు నిధులను పెంచే అవకాశమూ లేకపోలేదు. అలాగే పేదలకు గ్రామీణ, పట్టణ గృహనిర్మాణం కోసం ఎనిమిది వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిసింది. ఇక వైఎస్ జగన్ ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీల్లో ఒకటైన రైతు భరోసాకు దాదాపు పన్నెండు వేల కోట్లను కేటాయించనున్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి దాదాపు ఎనిమిదివేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించనుంది. ఇవి కాకుండా అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు, కులాల కార్పొరేషన్లకు కూడా భారీగా నిధులను కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం మీద జగన్ తొలి బడ్జెట్ మీద అనేక వర్గాలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి.

No comments:

Post a Comment