కరీంనగర్, జూలై 26, (way2newstv.in)
రైతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితులతో నీటి ఎత్తిపోత పూర్తిస్థాయిలో ఇంకా మొదలు కాలేదు. అయినా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావడంతో విద్యుత్ బిల్లులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.తెలంగాణ రైతాంగానికి గత నెలలో అంకితం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ బిల్లులు రావడం మొదలైంది. ప్రాజెక్టు ప్రారంభించి నెల రోజులు గడిచింది. నీటిని ఎత్తిపోసేందుకు కొన్ని పంప్సెట్లను అధికారులు వినియోగిస్తున్నారు. ఇందుకోసం విద్యుత్శాఖను ముందుగానే సీఎం కేసీఆర్ అప్రమత్తం చేసి భారీ పంప్సెట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
కాళేశ్వరం కరెంట్ బిల్లు 12 కోట్లు
ప్రాజెక్టు ప్రారంభమైన గత కొన్ని రోజులుగా నీటిని ఎత్తపోయడం కూడా ప్రభుత్వం మొదలు పెట్టింది. నీటిని ఎత్తి పోసేందుకు భారీ మోటార్లను వినియోగిస్తుండడంతో.... విద్యుత్ బిల్లులు కూడా భారీగానే చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తొలిమాసంలో ఒక్క కన్నెపల్లి పంప్హౌజ్ కరెంట్ బిల్లు 20 కోట్ల 64 లక్షలకు చేరింది. దీంతో పాత బకాయిలు 8 కోట్ల వరకు ఉన్నట్టు ట్రాక్స్కో ఇంజనీర్ చెబుతున్నారు.గతనెల 21న సీఎం కేసీఆర్ మేడిగడ్డ సమీపంలోని కన్నెపల్లి పంప్హౌజ్లో మోటార్లను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5.7 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజీకి పంపింగ్ చేశారు. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావడంతో ... దీనికి సంబంధించిన కరెంట్ బిల్లు ఎంత వచ్చిందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రతి నెలా 23న ట్రాక్స్కో ఇంజనీర్లు ఇక్కడ మీటర్ రీడింగ్ తీస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కన్నెపల్లి పంప్హౌజ్కు కోటి 96 లక్షల యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్టు రీడింగ్లో తేలింది. ఈఆర్సీ నిర్దేశించిన మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వాడుకునే కరెంట్కు ఒక్కో యూనిట్కు ఆరు రూపాయల చొప్పున బిల్లును లెక్కగట్టారు. కన్నెపల్లి కరెంట్ బిల్లు 12 కోట్ల 64 లక్షలు అయ్యింది. అంతకుముందు జూన్ 24 వరకు ఈ పంప్హౌజ్ దగ్గర టెస్టింగ్ , డ్రైరన్, వెట్రన్కు 14 లక్షల 15 వేల యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తంగా 20 కోట్ల 64 లక్షలకు కరెంట్ బిల్లు చేరింది. 2018 డిసెంబర్లోనే కన్నెపల్లి పంప్హౌజ్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ పంప్హౌజ్లో ఉన్న ఒక్కో మోటారు కెపాసిటీ 40 మోగావాట్లు. మోటార్ ఒక రోజంతా నడిస్తే 2300 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తుంది.కన్నెపల్లి దగ్గర ఆరు పంప్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. గురువారం వరకు ఇక్కడి పంప్లు మొత్తం 900 గంటలు రన్చేసినట్టు తెలుస్తోంది. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్హౌజ్లు పూర్తి స్థాయిలో వాడితే ఈ బిల్లు ఐదు రెట్లు పెరుగుతుందని అంచనా.
No comments:
Post a Comment