Breaking News

15/06/2019

18న తెలంగాణ కేబినెట్ భేటీ


హైద్రాబాద్, జూన్ 15(way2newstv.in)
తెలంగాణ మంత్రివర్గం సమావేశానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు నాలుగు నెలల అనంతరం ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో లోక్ సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కొంతకాలం నుంచి కీలక అంశాలపై నిర్ణయాలను వాయిదా వేస్తూ వస్తోంది ప్రభుత్వం. త్వరలోనే జరగబోయే ఈ సమావేశంలో అలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నూతన పురపాలన చట్టంతో పాటు రెవెన్యూ చట్టంలో సంస్కరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.


18న తెలంగాణ కేబినెట్ భేటీ

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతనంగా రుణాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో... దానిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ, పెన్షన్లు పెంపు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని సమాచారం. దీంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణంపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సచివాలయంలోని తమ భవనాలను వదలుకున్న నేపథ్యంలో... పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీనిపై కూడా మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పలు చట్టాల్లో మార్పులకు సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గం సమావేశం జరిగే మరుసటి రోజే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ నెల 19న టీఆర్ఎస్ భవన్‌లో ఈ సమావేశం జరపాలని పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పార్టీకి ఆయన ఎలాంటి దిశానిర్ధేశం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. 

No comments:

Post a Comment