విజయవాడ, మే 7, (way2newstv.in)
దాదాపు పద్నాలుగేళ్ల పాటు సీఎంగా అనుభవం ఉన్న చంద్రబాబుకు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక పట్టాన మింగుడు పడని పరిస్థితి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎల్వీ సుబ్రమణ్యం తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్వీపై పోరుగా డిసైడ్ అయిన బాబు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గలేదన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఎల్వీ విషయంలో లెక్కలు తేల్చుకోవాలన్న కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సంఘానికి బాబుకు మధ్య రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈసీ తీరును బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం మధ్యలో సీఎస్ ను మార్చేసి.. ఎల్వీ సుబ్రమణ్యం ను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.జగన్ అక్రమాస్తుల కేసులో ఎల్వీ పేరుందని.. అలాంటి ఆయన్ను ఎలా ఎంపిక చేస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే.. బాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఎల్వీ సుబ్రమణ్యంతో దూరం పెరిగింది.
సీఎస్ టార్గెట్ గా కేబినెట్..
బాబుతో ఆయన మాట్లాడని పరిస్థితి. అదే సమయంలో ఆయనతో బాబు మాట్లాడటం లేదు. ఇలా ఎవరి దారిన వారున్న వేళలో.. నిత్యం ఏదో అంశంపై రచ్చ నడుస్తూనే ఉంది. పోలింగ్ పూర్తి అయ్యాక రివ్యూ పెట్టే ప్రయత్నం చేయటం.. అధికారులు ఎవరూ సమీక్షలకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎస్ హోదాలో ఆదేశించటం సీఎం బాబుకు మరింత మండేలా చేసింది.ఇదిలా ఉంటే.. సీఎస్ గా ఎంపికైన నాటి నుంచి ఇప్పటివరకూ బాబు వద్దకు సుబ్రమణ్యం రాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆర్థిక శాఖలో లోపాల్ని వెతికే అంశంపై సుబ్రమణ్యం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సమాచారంతో బాబు మరింత కోపంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.తనను ఇబ్బందిపెడుతున్నారన్న భావనలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం మీదా.. సీఎస్ మీద గుర్రుగా ఉన్నారు. ఎలా అయినా వారికి తానేమిటో తెలియజెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారం కేబినెట్ మీటింగ్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. అయితే.. కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.దీనికి బాబు దగ్గర సమాధానం రెడీగా ఉంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకూ మోడీ సర్కారు నాలుగు కేబినెట్ మీటింగ్ లు నిర్వహించిందంటూ లెక్కలు చెబుతున్నారు. కోడ్ ఉంటేఎక్కడైనా ఒకటే రూల్ ఉండాలి కానీ.. వేర్వేరుగా ఉండదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఎవరైనా సరే బిజినెస్ రూల్స్ పాటించాల్సిందేనని.. కేబినెట్ సమావేశం నిర్వహణ సాధ్యం కాదని అధికారులు చెబితే.. మోడీ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా అధికారులకు నోట మాట రాకుండా చేయాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని చర్చించేందుకు ఇప్పటికే న్యాయనిపుణులతో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఎల్వీకి చెక్ పెట్టేందుకే తాజా కేబినెట్ సమావేశంగా తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అంటే.. ఎజెండా ఫిక్స్ చేయాల్సింది సీఎస్సే. తన వద్దకు హాజరు కాని సీఎస్ ను దారికి తెచ్చేందుకు బాబు కేబినెట్ మీటింగ్ అంశాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాబునుపెద్దగా పట్టించుకోకుండా తన దారిన తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఎల్వీ.. తాజా కేబినెట్ ఎపిసోడ్ లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
No comments:
Post a Comment