Breaking News

29/04/2019

అప్పుడే క్లాసులు ప్రారంభించిన కార్పొరేట్ కాలేజీలు

పట్టించుకోని అధికారులు
నెల్లూరు, ఏప్రిల్ 29, (way2newstv.in)
నెల్లూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 189 ప్రభుత్వ, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 58 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 116 కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 58 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. అదే నెల 29వ తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 3వ తేదీన జూనియర్‌ కళాశాలలు ప్రారంభించాల్సిఉంది. అయితే కళాశాలల యాజమాన్యాలు ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులతోపాటు పండగ రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, గాయిత్రి తదితర జూనియర్‌ కళాశాలలు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి.వేసవి సెలవులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపకుండా కళాశాలల్లోనే ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. 


అప్పుడే క్లాసులు ప్రారంభించిన కార్పొరేట్ కాలేజీలు

ముందుగానే టాలెంట్‌ టెస్ట్‌ రాయాలంటూ విద్యార్థులను కళాశాలలకు పిలిపించి వారిని తమ కళాశాలలో చేరే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిరోజూ ఏదో ఒక కళాశాలకు వెళ్లి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులతో మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరగతుల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగువేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పబ్లిక్‌ పరీక్షలు రాసిన వెంటనే మళ్లీ తరగతులు అంటే విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కనీసం ఆటవిడుపు కూడా లేకుండా నిత్యం పుస్తకాలు పట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాలతో విద్యార్థులను కుస్తీ పట్టిస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థులు రకరకాల మానసిక ఆందోళనకు గురివుతున్నారు.ఇంటర్‌లో ప్రవేశం కోసం కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఐఐటీ, నీట్‌ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.3.50 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. వీటితోపాటు దుస్తులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు, ఆన్‌లైన్‌లో పరీక్ష, మెయింటినెన్స్‌ల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే తమ పిల్లలు సెటిల్‌ అవుతారన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజులపై నియంత్రణ ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కార్పొరేట్‌ ఆగడాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments:

Post a Comment