Breaking News

25/04/2019

విజయనగరం వారసురాలికి కలిసొస్తుందా

విజయనగరం, ఏప్రిల్ 25, (way2newstv.in)
పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగరం ఆస్థానంలోని మరో వారసురాలు ఈ ఎన్నికలలో రాజకీయ అరంగేట్రం చేశారు. విజయనగరం నియోజకవర్గం నుంచి అశోక్ గజపతిరాజు కూతురు ఆదితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. విజయనగరం జిల్లాలో పట్టున్న కుటుంబం కావడంతో ఆమె రాజకీయ ప్రవేశంతోనే రికార్డు సృష్టిస్తుందని అందరూ భావించారు. అశోక్ గజపతిరాజు కూడా కూతురు ఆదితి రాజకీయ ప్రవేశానికి కొన్నేళ్ల నుంచి పునాదులు ఏర్పరచుకుంటూ వచ్చారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిపే పర్యటనలకు ఆమెను తీసుకెళ్లి ప్రజలకు పరిచయం చేశారు.అంతేకాదు విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే పనిని గత నాలుగేళ్లుగా ఆదితి గజపతిరాజు దగ్గరుండి చూసుకున్నారు. ఇలా ఆదితి ఎన్నికలకు ముందే విజయనగరం ప్రజలకు పరిచయమయ్యారు. 


విజయనగరం వారసురాలికి కలిసొస్తుందా

ఎన్నికలకు ముందు వరకూ ఆదితి గెలుపు తధ్యమన్నది విజయనగరం నియోజకవర్గంలో ఎవరి నోట విన్నా విన్పించే మాట. కానీ పోలింగ్ జరిగిన తర్వాత మాత్రం ఆదితి గెలుపుపై సందేహాలు అలుముకున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో ఆదితి గజపతిరాజు ప్రచారం కూడా విస్తృతంగా చేశారు. తండ్రి సహకారంతో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆదితి ఎన్నికల సమయంలో దూకుడు ప్రదర్శించారు.ఆదితి గజపతిరాజు గట్టి ప్రత్యర్థితో తలపడ్డారు. రాజకుటుంబంపై ఉన్న అసంతృప్తి కూడా ఆదితి గెలుపుపై పడిందంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడంతో ప్రత్యర్థి ఎవరైనా తమదే గెలుపన్న ధీమాతో రాజకుటుంబం ఉంది. అయితే వైసీపీ నుంచి మరోసారి బలమైన నేత కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేయడంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందన్నది పోల్ పోస్ట్ మార్టంలో తేలిందట. క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందన్నది రాజకుటుంబం అంచనా. మెజారిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు గెలుపుపైనే సందేహాలు వ్యక్తం చేస్తుండటం విశేషం.ఇద్దరిలో ఒకరికి ఓటు వేస్తే చాలులే అన్నది ఓటర్లలో వచ్చిందంటున్నారు. ఎంపీగా అశోక్ గజపతిరాజుకు ఓటేసిన వారు, ఎమ్మెల్యే విషయానికి వచ్చే సరికి కోలగట్ల వైపు మొగ్గు చూపారంటున్నారు. సామాజిక వర్గం పరంగా కోలగట్ల బలమైన నేత కావడంతో భారీగా టీడీపీ ఓట్లను చీల్చారంటున్నారు. దీంతో కొద్ది తేడాతోనైనా కోలగట్ల విజయం ఖాయమన్న ప్రచారం ఆ ప్రాంతంలో జోరుగా సాగుతోంది. టిక్కెట్ దక్కని మీసాల గీత వర్గం కూడా వ్యతిరేకంగా పనిచేసినట్లు రాజుగారి ఫ్యామిలీ గుర్తించిందంట. అయితే కోలగట్ల వీరభద్రస్వామిని ఓడించాలని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రయత్నించారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బొత్స సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు సామాజిక వర్గం కోలగట్ల కు వేయకుండా ఆదితికి వేశారన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద రాజకీయ అరంగేట్రంలోనే ఆదితి గెలుపుపై అపనమ్మకం ఏర్పడింది.

No comments:

Post a Comment