Breaking News

05/04/2019

ఉగాది జనులకు ఆయుష్షుకు రోజు

హైద్రాబాద్, ఏప్రిల్ 5, (way2newstv.in)
ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు. 


ఉగాది జనులకు ఆయుష్షుకు రోజు

విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీవికారి నామ తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకునే సమయం, ముహూర్తం గురించి పండితులు తెలియజేశారు. ఉగాది పర్వదినం ఏప్రిల్ 6 శనివారం. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం శనివారమే జరుపుకోవాలి. ఉగాది రోజున అత్యంత ముఖ్యమైనది పచ్చడి. ఈ పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేశారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, పచ్చడి తయారు చేయాలి. దీనిని దేవునికి సమర్పించిన తర్వాత ఉదయం 7.40 నుంచి 10.30 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం. అలాగే ఉదయం 10 నుంచి 11.45 మధ్య కొత్త వస్తువులు, పసుపు, బంగారం, బెల్లం మొదలైనవి కొనుగోలు చేయడానికి శుభ సమయమని వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు ఈ రోజునే కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. కాబట్టి కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించడానికి ఉదయం 10.15 గంటల నుంచి 10.45 మధ్య మంచి ముహూర్తం. తిరిగి మధ్యాహ్నం 12.49లకు ముహూర్తం బాగుందని వెల్లడించారు

No comments:

Post a Comment