Breaking News

08/04/2019

ముగ్గురు వ్యాపారవేత్తల పోటీ

హైద్రాబాద్, ఏప్రిల్ 8(way2newstv.in)
తెలంగాణ లోక్‌ స‌భ స్థానాల్లో చేవెళ్ల‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ఇక్క‌డ ఓటర్ల తీర్పు విల‌క్ష‌ణంగానే ఉంటుంది. దీంతో పార్టీల‌న్ని ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని చాలా ప్ర‌తిష్ఠ‌త్మ‌కంగా తీసుకున్నాయి. అందులో భాగంగానే ఇక్క‌డ హేమాహేమీల‌ను త‌మ పార్టీల నుంచి అభ్య‌ర్థులుగా నిల‌బెట్టాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉంటుందా అని ఆసక్తికరంగా మారింది. 2009లో పార్లమెంట్‌ స్థానంగా ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌కు పట్టుకొమ్మ. కాంగ్రెస్‌ దిగ్గజ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఏవైనా హస్తం పట్టు సాధించాల్సిందే. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మొత్తం ఓటర్లు 24 లక్షల 15 వేల 598. ఇందులో పురుషులు 11 లక్షల 53 వేల 49, మహిళలు 10 లక్షల 32 వేల 130 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో మొత్తం 13లక్షల 15 వేల 862 ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కార్తీక్‌రెడ్డి, టీడీపీ నుంచి వీరేందర్‌గౌడ్‌ పోటీ చేశారు. 


ముగ్గురు వ్యాపారవేత్తల పోటీ

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగిన పోరులో చివరకు చేవెళ్లలో గులాబీ జెండా రెపరెపలాడించింది. టీఆర్ఎస్‌ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 4,35,077 ఓట్లు (33.06శాతం) వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డికి 3,62,054 ఓట్లు (27.51 శాతం) వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన వీరేందర్‌ గౌడ్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ సారి చేవెళ్లలో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.2014లో టీఆర్ఎస్‌ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తుండగా తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యాపారవేత్త రంజిత్‌రెడ్డిని టీఆర్ఎస్‌ బరిలో నిలిపింది. బీజేపీ తరఫున ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జనార్దన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ముగ్గురు అభ్యర్థులు త‌మ త‌మ గెలుపు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోన్నారు.లోక్‌సభ పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండటం, పార్టీలోకి జోరుగా వలసలు, బలమైన పార్టీ యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండటం టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్లస్‌ పాయింట్లు. రాజకీయాలకు కొత్త కావడం, క్షేత్రస్థాయిలో నాయకులతో పరిచయాలు లేకపోవడం, పార్టీ ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం మైనస్‌.

No comments:

Post a Comment