Breaking News

15/04/2019

యాసంగి పైర్లపై సూర్య ప్రతాపం

నిజామాబాద్, ఏప్రిల్ (way2newstv.in)
సూర్యుడి ప్రతాపం..యాసంగి పైర్లపై పడింది. ఎండలకు తట్టుకోలేక పైర్లు నేలవాలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా తాడికల్, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లలో 44 డిగ్రీలు టెంపరేచర్ రికార్డయ్యింది. ఈ ప్రాంతాల్లో ఉన్న పంటలు సాగు దశలో ఉణ్నాయి. సాగునీరు లేకపోవడంతో రైతులు ఒకవైపు సతమతమవుతుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల వడగండ్ల వానలు, పెనుగాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 21 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.గత జులై నుండి రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవలేదు. ఖరీఫ్, ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు నీరందించడం రైతన్నలకు భారంగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్ నుండి ఇప్పటి వరకూ సాధారణం కన్నా 16 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుండి 45 వరకూ ఉంది. మొత్తం 21 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు తగ్గినట్లు భూగర్భ జల శాఖ వెల్లడించింది


యాసంగి పైర్లపై సూర్య ప్రతాపం

మరో వైపు రాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు అన్ని కాలువల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్‌ అధికారులు నిలిపివేశారు. ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుత యాసంగి సీజన్‌లో కాకతీయ కాలువ ద్వారా, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.. ప్రాజెక్ట్‌ నుంచి జనవరి 15 నుంచి నీటి విడుదల చేపట్టి మార్చి 31 న పూర్తి చేయాలని మొదట ప్రణాళిక రూపొందించారు. కానీ చివరికి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌ నుంచి ఫిబ్రవరి 1 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల చేపట్టారు. నాలుగు విడతలు అందించారు. ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటల కోసం అన్ని కాలువలతోపాటు, తాగు నీటి అవసరాల కోసం 19.5 టీఎంసీల నీటిని వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 14.5 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.41 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 1.31 టీఎంసీలు, అలీసాగర్‌ గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 1.98 టీఎంసీల నీటిని విడుదల చేశామని, తాగు నీటి పథకాల కోసం 0.79 టీఎంసీల నీటిని అందించామని అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 1.18 టీఎంసీల నీరు వృథా అయ్యిందంటున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1,053.30(8.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

No comments:

Post a Comment