Breaking News

22/04/2019

ఒడిశాలో నవీన్ గ్రాఫ్ అలానే ఉందా

భువనేశ్వర్, ఏప్రిల్ 22  (way2newstv.in)
ఒడిశాలో ఇప్పటివరకూ రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు దశల్లోనూ బిజూ జనతాదళ్ దే పైచేయిగా ఉందంటున్నారు విశ్లేషకులు. పైకి త్రిముఖ పోరు అని అనిపిస్తున్నా… బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం ఏకపక్ష విజయం సాధించబోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రాన్ని పంధొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా ఏలుతున్న నవీన్ పట్నాయక్ కు మరోసారి ప్రజలు పట్టంకట్టనున్నారన్నది అంచనా. నవీన్ పట్నాయక్ నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అంతేకాకుండా పాలనలో పారదర్శకతను చూపారు.ఒడిశా అంటేనే నవీన్ పట్నాయక్….నవీన్ పట్నాయక్ అంటేనే ఒడిశా… నవీన్ పట్నాయక్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనపై ఉన్న విశ్వాసం, పాలనపై ఉన్న అభిమానం నుంచి ప్రజలు దూరం కాలేకపోయారన్నది పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. గత నాలుగు దఫాలుగా బిజూ జనతాదళ్ ఒడిశాలో అధికారంలో ఉండటంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించారు. 


ఒడిశాలో నవీన్ గ్రాఫ్ అలానే ఉందా

మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా బీజేడీ విజయానికి అడ్డుపడుతుందని అంచనాలు తొలుత వచ్చాయి. అందుకే అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే నవీన్ మంత్రులను నిర్దాక్షిణ్యంగా తొలిగించారు. కానీ పోలింగ్ జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు సయితం తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి కన్పిస్తోంది.నవీన్ పట్నాయక్ ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకుపైనే ఆధారపడ్డారు. ఆయన రాష్ట్రంలో శక్తి మిషన్ ను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు చేయూత నిచ్చారు. దాదాపు 80 లక్షల మంది ఈ గ్రూపుల్లో ఉన్నారు. వీరికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా శక్తి మిషన్ ప్రారంభించారు. రైతుల కోసం కాలియా పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత అప్పటి వరకూ నవీన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్న అన్నదాతలు శాంతపడ్డారు. నవీన్ కు ఎన్నికల సమయంలో చేరువయ్యారన్నది ఆ పార్టీ నేతల అంచనా.మరోవైపు తన ప్రత్యర్థి పార్టీగా నవీన్ బీజేపీనే చూశారు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, బీజేపీ పుంజుకుందని గ్రహించిన నవీన్ తన ఎన్నికల ప్రచారంలో సయితం మోదీని, బీజేపీనే టార్గెట్ చేశారు. తుఫానుల తాకిడికి ఒడిశా విలవిలలాడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదని, మోదీ ఒడిశా మీద ఎన్నికల వేళ చూపుతున్న ప్రేమ నాటకమని ఆయన ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ తర్వాత స్థానమేనన్నది ఈ రెండు దశల ఎన్నికల్లో తేలిందంటున్నారు.  పార్లమెంటు సీట్లు గతం కంటే కొంచెం తగ్గినప్పటీకి రాష్ట్రంలో అధికారంలో మాత్రం నవీన్ దేనన్న టాక్ వినపడుతోంది. మొత్తం  మీద నవీన్ పట్నాయక్ గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment