నిజామాబాద్, మార్చి 26 (way2newstv.in)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. గడువు ముగిసేలోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లోకి చేరుకున్న వారు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. చివరి రోజైన సోమవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ స్థానం నుంచి పసుపు, ఎర్రజొన్న రైతులు తమ నిరసన తెలుపుతూ.. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానానికి అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. దేశంలోనే అత్యధిక నామినేషన్లు నిజామాబాద్లోనే దాఖలవడం గమనార్హం. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బరిలో ఉండటంతో ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ లో బ్యాలెట్ పోరే...
ఈవీఎంల ద్వారా ఒక్కో స్థానం నుంచి గరిష్టంగా 96 మంది అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రజత్ కుమార్ తెలిపారు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు ఇచ్చిన ఈవీఎంలలో గరిష్టంగా 96 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలు పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొత్త మెషీన్ల ద్వారా 383 మంది అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించవచ్చునని వివరించారు. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారనే అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ స్థానం నుంచి చివరికి ఎంత మంది బరిలో ఉంటారనే అంశంపై ఆధారపడి అక్కడ ఎన్నికలు ఈవీఎంలతో లేదా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాల్సి వస్తే.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడానికి నిజామాబాద్ జిల్లా రైతులు నామినేషన్లను ఎంచుకున్నారు. 200 మందికి పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని కోరుతూ చెరకు రైతులు సైతం నిరసన బాట పట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపిన రజత్ కుమార్.. కౌంటింగ్కు ఎంత టైమ్ పడుతుందో మీరే చూడండని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు
No comments:
Post a Comment