Breaking News

13/03/2019

కీలకం కానున్న తెలుగు ఓటరు

హైద్రాబాద్, విజయవాడ, మార్చి 13, (way2newstv.in
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ఓటరు తీర్పు చాలా కీలకం కాబోతోంది. తెలంగాణ , ఆంధ్రల్లోని నలభైరెండు స్థానాల్లో ప్రధాన జాతీయపార్టీలు ఒక్కసీటు కూడా గెలుచుకోబోవడం లేదని అన్ని సర్వేలు నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పేస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రంలోని యూపీఏ,ఎన్డీఏల్లోని ఏ కూటమిలోనూ ఈ రెండు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు భాగస్వాములు కాదు. ఈ సంతులనాత్మక వ్యూహమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రాంతీయాధినేతలకు ఎనలేని ప్రాముఖ్యాన్ని తెచ్చిపెడుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి నాయకులైతే 16 సీట్లు గెలిపించండి చాలు . ప్రధానిని నిర్ణయిస్తామంటూ బోర విరిచి చెబుతున్నారు. అంతటి ధైర్యానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికంగా సీట్లు తెచ్చుకున్న కూటమికి సర్కారు ఏర్పాటుకు మరో 30,40 స్థానాల లోటు కచ్చితంగా ఉంటుందని ఎన్నికల గణాంకకులు పేర్కొంటున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పేయొచ్చనేది తెలుగునాయకుల తెరవెనక ఆశ.కోడి కత్తి దాడితో సంచలనాత్మక ఆరోపణలు చేసిన వైసీపీ ప్రస్తుతానికి ఆ అంశం నుంచి దూరమై పోయింది. జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణకు అనుమతి పొందడంతోనే విషయం చప్పబడిపోయింది. స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్ఐఏ వారు ఒక అంచనాకు వచ్చేశారు. 


 కీలకం కానున్న తెలుగు ఓటరు

ఇది తమ స్థాయి కేసు కాదని అంతర్గతంగా అభిప్రాయపడుతున్నట్లు ఢిల్లీ రాజకీయ నాయకులు చెబుతున్నారు. దీంతో కేసు దాదాపు నీరుగారిపోయినట్లే. రాజకీయంగా ఆశించిన మైలేజీ వైసీపీకి దక్కలేదు. ప్రధాన నిందితుడు తాను ఎటువంటి స్టాండ్ మార్చకుండా జగన్ అభిమానినే అని చెబుతుండటంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. కేసులో పురోగతి లేదు. ఎన్నికల లోపు విచారణ ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇదొక హాస్యాస్పదమైన ప్రహసనంగా ముగించేందుకు చేయని ప్రయత్నం లేదు.టాకింగ్ పాయింట్లు సైతం రాసుకుని దర్యాప్తు సంస్థలు ఏమేం చేయాలో సూచిస్తూ తయారు చేసుకున్న నోట్ ప్రత్యర్థి తెలుగుదేశం చేతిలో పడటంతోనే వైసీపీకి కొంత డ్యామేజీ జరిగింది. డేటా చోరీకి సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే శతవిధాలుగా యత్నిస్తోందన్న విషయాన్ని తెలుగుదేశం బాగానే ఎస్టాబ్లిష్ చేయగలిగింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఒక దశకు చేరిన తర్వాత కొత్త సమాచారం అందక మందకొడిగా నత్తనడక మొదలైంది. ఎన్నికల్లోపు దీని అంతచూసే పరిస్థితి లేదని సీనియర్ పోలీసు అధికారులు ఒప్పుకుంటున్నారు. దాంతో సైకలాజికల్ గా టీడీపీ తప్పు చేసిందనే విషయాన్ని ఓటర్ల దృష్టిలో పెట్టడానికే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల కమిషన్ ను విచారణలోకి లాగేందుకు యత్నిస్తోంది. ఓటర్ల జాబితాను తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేస్తున్న దృష్ట్యా చర్యలకు దిగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. సంబంధిత చర్యల కోసం రాజకీయంగా ఒత్తిడి మొదలుపెట్టింది.ఉమ్మడి రాజదాని,తెలంగాణలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఓటు వినియోగించుకుంటున్న దాదాపు 20 లక్షల మందిని లక్ష్యంగా చేసుకుంటూ సంధించిన ఫార్మ్ సెవెన్ వైసీపీకి కలిసి రాలేదు. టీడీపీ అప్రమత్తం కావడంతో రాజకీయ బురదను పులుముకునేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడం లేదు. ఎన్నికల వరకూ ఓటర్ల తొలగింపు జరగదని హామీ ఇచ్చేసింది. అందులోనూ బల్క్ గా వచ్చిన ఫిర్యాదులను అసలు పట్టించుకోమంటోంది. దీంతో ఇటీవల రాజకీయ దుమారం రేకెత్తించిన అన్ని అంశాలూ అటకెక్కేసినట్లే కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల తేదీ ముందుగా ప్రకటించేయడంలో ప్రత్యర్థి కుట్రలున్నాయనే కోణంలో కొత్త ప్రచారం మొదలైంది. సన్నద్ధతలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. 120 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితా తయారైపోయింది. అందులో మార్పులు చేర్పులకు ఆస్కారం లేదు. వైసీపీ విషయానికొస్తే 50 నియోజకవర్గాల్లో మాత్రమే మార్పులకు తావులేని చిట్టా తయారైంది. జనసేన పరిస్థితి ఇంకా గందరగోళంగా, అయోమయంగా ఉంది. కాంగ్రెసు, బీజేపీలది నామ్ కే వాస్తే పోటీలే. ముందుగా ఎన్నికలు రావడం వల్ల ప్రచారాన్ని కుదించుకోవాల్సి వస్తోందని తెలుగుదేశం చెబుతోంది. మేం సిద్ధం కాకుండానే ఎన్నికలు రావడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉండి ఉండవచ్చని వైసీపీ ఆరోపిస్తోంది. పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ పోటీలో నిలబడే అభ్యర్థులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో పెట్టేయడం వల్ల నాలుగు నుంచి అయిదు కోట్ల రూపాయల వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఖర్చు మిగులుతుందని సంతోషిస్తున్నారు

No comments:

Post a Comment