Breaking News

28/03/2019

పుల్వామా దాడిపై భారత్ పక్కా ఆధారాలు

పట్టించుకోని పాకిస్తాన్
న్యూఢిల్లీ, మార్చి 28, (way2newstv.in)
ఫిబ్రవరి 14న పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మహ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి వెనుక జైషే మహ్మద్‌ హస్తం ఉందని, దీనికి సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను పాక్‌కు భారత్ అందజేసింది. వీటిపై స్పందించిన దాయాది, భారత్ సమర్పించిన ఆధారాల ప్రకారం తాము దర్యాప్తు జరిపామని, వారి చెప్పిన ప్రాంతాల్లో అసలు ఉగ్ర శిబిరాలే లేవని బుకాయించింది. అంతేకాదు, భారత్‌ కూడా వచ్చి చూస్తానంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దీనికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. పుల్వామా ఆత్మాహుతి దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్‌, తమ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ ఇకనైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 


పుల్వామా దాడిపై భారత్ పక్కా ఆధారాలు

పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ కుట్రకు సంబంధించిన కీలక పత్రాలను ఫిబ్రవరి 27న ఢిల్లీలో పాక్‌ తాత్కాలిక హైకమిషనర్‌కు కేంద్రం అందజేసింది. వీటి ఆధారంగా విచారణకు ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ వ్యవహారంలో అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించామని, సోషల్‌ మీడియా ఖాతాలపై కూడా విచారించామని పేర్కొంది. అయితే పుల్వామా దాడికి సంబంధించిన ఏ ఆధారాలు లభించలేదని తేల్చింది. దీనిపై పాక్ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది..‘భారత్‌ అందజేసిన పత్రాల్లో పేర్కొన్నట్టుగా 22 ప్రదేశాలను విస్తృతంగా పరిశీలించామని, అక్కడ ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవు.. అలాగే 54 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాం. అయితే, వారికి పుల్వామా దాడితో సంబంధమున్నట్లు ఎలాంటి రుజువులు లభించలేదు. కావాలంటే భారత్ అధికారులు ఈ ప్రాంతాలకు వచ్చి పరిశీలించుకోవచ్చని, ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని’స్పష్టం చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ముందు ఉగ్రవాదుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన మొబైల్ సమాచారాన్ని నెంబర్లతో సహా భారత్ అందజేసింది. మొత్తం 22 ప్రాంతాల్లోని 90 మంది అనుమానితులుగా పేర్కొంది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన భారత్, పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. దీంతో ఇరు దేశాల మధ్య కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. ఒక దశలో ఒకరిపై ఒకరు క్షిపణి దాడులకు సైతం సిద్ధపడినట్టు విదేశీ అధికారులు ఇటీవలే వెల్లడించారు

No comments:

Post a Comment