Breaking News

28/03/2019

లక్ష్యం సరే..ఆచరణ ఏదీ

విజయవాడ,మార్చి 28 (way2newstv.in)
విజయవాడ కార్పొరేషన్ లో  నూరు శాతం పన్ను వసూలు చేయాలన్న విఎంసి కమిషనర్ టార్గెట్‌కు మరో రెండు రోజులే ఉన్నాయి.నూరు శాతం వసూలు అన్నది సాధ్యకాని పరిస్థితి కాబట్టి గత సంవత్సరం కన్నా మరింత ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయాలన్న సిబ్బంది ఆలోచనగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలావుండగా సాధారణ ప్రజల నుంచి వసూలయ్యే పన్ను ఎలాగైనా వస్తుంది, కానీ దీర్ఘకాలిక బకాయిలు, కోర్టు వివాద కేసుల్లో ఉన్న పన్ను మొత్తంతో పాటు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పన్ను బకాయిల వసూలు విషయంలో ఇప్పటికే చేతులెత్తేసిన విఎంసి అధికారులు తమ ప్రతాపం మొత్తాన్ని సామాన్యులపైనే చూపిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విఎంసి ఖజానాకు జమకావాల్సిన పన్ను మొత్తాలను పరిశీలిస్తే సుమారుగా ఆస్తి పన్ను 163 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను 78 కోట్లు, వృత్తి పన్ను 13 కోట్లు, నీటి పన్ను 29కోట్లు, సీవరేజ్ పన్ను 10 కోట్లు, నీటి మీటర్ల పన్ను 18 కోట్లు, డి అండ్ ఓ లైసెన్స్ ఫీజు మొత్త 11 కోట్లు, ఇతర విభాగాల నుంచి 157 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ వసూలైన మొత్తాలను పరిశీలిస్తే ఆస్తిపన్ను సుమారు 80 కోట్లు, సీవరేజ్ 8 కోట్లు, నీటి పన్ను 21 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను 10 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. 


లక్ష్యం సరే..ఆచరణ ఏదీ

ఖాళీ స్థలాల యజమానుల అడ్రస్‌లు సరిగా దొరకకపోవడంతో వాటి వసూలు సాధ్యం కావడం లేదన్న విషయం గత మూడు సంవత్సరాలుగా అధికార, సిబ్బంది వినిపిస్తున్న మాట. బకాయిలు 78 కోట్లుగా ఉంటే వసూలు మాత్రం 10 కోట్లుగానే ఉంటోంది. ప్రతి సంవత్సరం ఇదే మాట చెప్పి నెట్టుకొస్తున్న అధికారులు ఖాళీ స్థల పన్ను వసూలు ప్రక్రియలో కావాలనే అలక్ష్యం, యజమానులతో లాలూచి పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా వివిధ అంశాల్లో జాతీయ స్థాయి గుర్తింపు అవార్డులు పొందిన విఎంసి పన్ను వసూలు లో మాత్రం ఘోరంగా వెనకబడింది. తమ అధికార ప్రతాపాన్ని సామాన్యుల పైనే చూపిస్తున్న విఎంసి అధికారులు బడా బాబుల జోలికి మాత్రం వెళ్ళిన దాఖలాలు కనిపించడం లేదు. పన్ను చెల్లింపులలో జాప్యం వహించారన్న నెపంతో ఇప్పటికే వందలాది ఇళ్లకు చెందిన నీటి కనెక్షన్లను కట్ చేసిన విషయం అధికారికంగానే తెలుస్తోంది. కమిషనర్ మెప్పుకోసం కొంత మంది రెవెన్యూ బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐ పలువురు తాము కట్ చేసిన నీటి కనెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇదిలావుండగా విఎంసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేసే పెండింగ్ టాక్స్ పేయర్స్ లిస్టుకు వాస్తవ జాబితాకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం పెండింగ్ ట్యాక్స్ పేయర్స్ జాబితాలో నగరానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పేర్లు కనిపించడమే కాకుండా వారు చెల్లించాల్సిన లక్షలాది రూపాయల బకాయిలపై రాద్దాంతం జరిగింది.  ప్రస్తుతం ఆస్తిపన్ను మొత్తం 168 కోట్లలో కనీసం 100 కోట్లనైనా వసూలు చేసి కమిషనర్ వీరపాండియన్‌ను శాంతింప చేద్దామనే విషయంపై విఎంసి రెవెన్యూలో విభాగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment