Breaking News

28/02/2019

అనంతపురంలో 53 మండలాల్లో కరువు

అనంతపురం, ఫిబ్రవరి 28, (way2newstv.in
అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌తో పాటు రబీలోనూ వర్షాభావ పరిస్థితులు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. పంటలు దెబ్బ తినడంతో జిల్లా అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఖరీఫ్‌లో మొదటి విడత 37 మండలాలు, రెండో విడతగా మరో 13 మండలాలను కరువు జాబితాలో చేర్చారు. ఇక రబీలో మొత్తం 53 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు జాబితా ప్రకారం ప్రభుత్వం పరిహారం పంపిణీ, కరువుపై ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలో రబీ సాధారణ సాగు 3,33,698 హెక్టార్లు.. 2,55,875 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో 149.6 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 35.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడంతో బోర్ల కింద తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రబీ పంటలు ఎండిపోయాయి. సుమరుగా 2 లక్షల హెక్టార్లలో పంటలు చేతికందకుండా పోయాయి. ముఖ్యంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆస్పరి, నందికొట్కూరు, ఆదోని, ఆలూరు మండలాల్లో మిరప, పత్తి, టమోటా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయాయి. 


అనంతపురంలో 53 మండలాల్లో కరువు

దాదాపు రూ.639 కోట్లను రైతులు పెట్టుబడి కింద నష్టపోయారు. తీవ్ర వర్షాభావం మూలంగా రబీలోనూ రైతులకు నిరాశ తప్పలేదు. రబీలో సాగు చేసిన అన్ని పంటలు దెబ్బ తిన్నాయని, 53 మండలాల్లో పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు newspప్రభుత్వానికి నివేదిక అందజేశారు.  ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్‌ సీజన్‌లో 4,02,505 హెక్లార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో నష్టపోయిన 4,75,458 మంది రైతులకు రూ.616 కోట్ల పరిహారం మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. రబీ సీజన్‌ 2018 అక్టోబర్‌ నుంచి మొదలైంది. వర్షం కురవక పోవడంతో పూర్తిస్థాయిలో పంటలు వేయలేదు. శనగ 1,42,131 హెక్టార్లలో వేశారు. జొన్న, మొక్కజొన్న, ధనియాలు ఎక్కువగా సాగు చేశారు. ఈసారి శనగ కూడా రైతులను ముంచింది. కేవలం శనగకే రూ.355 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మిగతా అన్ని పంటలకు కలిపి ఎకరాకు రూ.25 వేల చొప్పున వేసి జిల్లావ్యాప్తంగా రూ.639 కోట్లు రైతులు నష్టపోయినట్లు అంచనా వేయడంతో పాటు 53 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు పంపారు. రబీలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 1.50 లక్షల మంది రైతులు ఫసల్‌ బీమాకు ప్రీమియం చెల్లించారు. వచ్చిన నష్టం బీమా తీర్చుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.కరువుతో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే పరిహారం అందించి ఆదుకుంటామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో ఎంతో జాప్యం చేస్తోంది. ఫలితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తక్షణ సహాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి చెబుతున్నా అమలులో మాత్రం ఎక్కడా కదలిక లేదు. రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

No comments:

Post a Comment