Breaking News

27/08/2018

ఉప ఎన్నికల్లో మేఘాలయా ముఖ్యమంత్రి జయభేరీ

షిల్లాంగ్‌ ఆగష్టు27 (way2newstv.in)
దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మేఘాలయా ముఖ్యమంత్రి, ఎన్‌పీపీ అధ్యక్షుడు కాన్రాడ్‌ సంగ్మా ఉప ఎన్నికల్లో జయభేరీ మోగించారు. సంగ్మా 13,600లకు పైగా ఓట్లతో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి ఛార్లెట్‌ డబ్ల్యూ మోమిన్‌పై విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ 19, కాంగ్రెస్‌కు 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. భాజపా, ఎన్సీపీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్‌పీపీ మేఘాలయ డెమోక్రటిక్‌ అలియన్స్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో కాన్రాడ్‌ సంగ్మా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కాన్రాడ్‌ సీఎంగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మార్చి ఎన్నికల్లో దక్షిణ తురా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాన్రాడ్‌ సోదరి అగధ సంగ్మా తన పదవికి రాజీనామా చేసి ఆయనకు మార్గం సుగమం చేశారు. అలా కాన్రాడ్‌ ఉప ఎన్నికల్లో దక్షిణ తురా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సంగ్మా విజయంతో మేఘాలయ అసెంబ్లీలో ఎన్‌పీపీ పార్టీ సంఖ్యాబలం 20కి పెరిగి ప్రతిపక్ష కాంగ్రెస్‌తో సమానమైంది.



ఉప ఎన్నికల్లో మేఘాలయా ముఖ్యమంత్రి జయభేరీ

No comments:

Post a Comment