Breaking News

28/01/2020

నాకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది:కేకే

హైదరాబాద్‌ జనవరి 28 (way2newstv.in)
మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం విదితమే. అయితే రాజ్యసభ సభ్యులు కే కేశవరావు తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటు వేయడాన్ని కాంగ్రెస్‌ నాయకులు తప్పుబట్టారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్‌అఫిషీయో ఓటు హక్కు కల్పించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని రాజ్యసభ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కే కేశవరావు మంగళవారం కలిశారు. 
నాకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది:కేకే

ఎక్స్‌అఫిషీయో సభ్యత్వ అంశాన్ని కేకే నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావుకు ఎక్స్‌అఫిషీయో ఓటు కల్పించడంపై కేకే అభ్యంతరం వ్యక్తం చేశారు.నాగిరెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. తాను తప్పు ఓటు వేశానని అనడం సబబు కాదన్నారు కేకే. వాస్తవాలన్నింటినీ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. పరస్పరం రాష్ర్టాలు మార్చుకుంటూ తాను, కేవీపీ లేఖలు ఇచ్చామన్నారు. అప్పటి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆదేశాలు కూడా ఇచ్చారని కేకే గుర్తు చేశారు. దీనికి సంబంధించి 2014లో గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారని కేకే స్పష్టం చేశారు. కేవీపికి తెలంగాణలో సాధారణ ఓటు హక్కు కూడా లేదన్నారు. ఇద్దరికి ఓటు హక్కు ఇవ్వడం సరికాదు, తాను ఎలాగూ ఓటు వేశాను. కేవీపీకి ఓటు హక్కు ఇస్తారో లేదో ఎస్‌ఈసీ చూసుకోవాలి. తప్పు ఎక్కడ జరిగిందన్నది తానేలా చెబుతాను అని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితీరు వల్లే టీఆర్‌ఎస్‌ వరుసగా ఘనవిజయాలు సాధిస్తుందని కేకే స్పష్టం చేశారు.

No comments:

Post a Comment