Breaking News

07/12/2019

ఇంటర్నేషనల్ ఐటెమ్ గా మారిపోయిన దిశా నిందితుల ఎన్ కౌంటర్

హైద్రాబాద్, డిసెంబర్ 7, (way2newstv.in)
హైదరాబాద్‌లో జరిగిన దిశ ఎన్‌కౌంటర్ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు మానవ మృగాలు దారుణంగా అత్యాచారం చేసి, సజీవంగా దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులను చంపేయాలని దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు రేగాయి. ఈ క్రమంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్ పరిణామం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు బ్యానర్ హెడ్డింగ్‌లతో ప్రచురించాయి.
ఇంటర్నేషనల్ ఐటెమ్ గా మారిపోయిన దిశా నిందితుల ఎన్ కౌంటర్

భారత్‌లో పెరుగుతున్న దారుణాలు :వాషింగ్టన్ పోస్ట్మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్న భారత్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్ వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ వార్త రాసింది. దీన్ని కొందరు మానవ హక్కుల ఉద్యమకారులు విమర్శలు చేస్తున్నట్లు అందులో వివరించింది.
ప్రజల కోరిక మేరకే... :ద గార్డియన్
దిశ అనే మహిళకు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నట్లు ఈ పత్రిక పేర్కొంది. దేశ ప్రజలు ఆశించిన మేరకే నిందితులు చంపబడ్డారని వెల్లడించింది. మరోవైపు, చట్టాన్ని పోలీసులు తమ చేతిలోకి తీసుకున్నాని వస్తున్న వార్తలను సైతం ప్రస్తావించింది.
ప్రజల ఆమోదం పొందింది: ద టెలిగ్రాఫ్
నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన దేశ వ్యాప్త ప్రజల ఆమోదం పొందిందని ద టెలిగ్రాఫ్ పత్రిక వార్త రాసింది. దీనిని ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు సమర్థించగా, కొందరు నాయకులు మాత్రం విమర్శలు చేసినట్లు తెలిపింది.
పోలీసులు హీరోలయ్యారు :ద న్యూయార్క్ టైమ్స్
భారత్‌లో జరిగిన ఈ దారుణ ఘటన షాక్‌కు గురి చేసిందని, నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో హైదరాబాద్ పోలీసులు హీరోలు అయ్యారని మరో దిగ్గజ వార్తా సంస్థ ద న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.కమిషనర్ వీసీ సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పోలుస్తూ అమెరికాకు చెందిన మరో ప్రముఖ పత్రిక హఫ్ పోస్ట్ వార్త ప్రచురించింది. అప్పట్లో వరంగల్‌లో యాసిడ్ దాడిలో గాయపడ్డ ప్రణీతతో చేసిన ఇంటర్వ్యూను కూడా ప్రచురించింది. ఆమె అమెరికాలోనే నివసిస్తున్నారు.
దుబాయ్, ఖతర్‌కు చెందిన మీడియా సంస్థలైన ఖలీజ్ టైమ్స్, అల్-జజీరా, గల్ఫ్ న్యూస్ వార్తా సంస్థలు కూడా ఈ వార్తను ప్రముఖంగానే ప్రచురించాయి. భారత దేశంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక విమర్శలొస్తున్నాయని, అయినా ప్రజలు ఈ ఎన్‌కౌంటర్‌ను సంబరంగా భావిస్తున్నారని ఈ సంస్థలు వెల్లడించాయి.‘పోలీసులు నిందితులను చంపడాన్ని భారతీయులు ఎందుకు వేడుకగా జరుపుకుంటున్నారు’ అనే ప్రధానాంశంతో బ్రిటన్‌లోని లండన్ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కథనం రాసింది. వెబ్‌సైట్‌లోనే కాక, బీబీసీ వరల్డ్ న్యూస్‌లోనూ ఈ వార్తను ప్రసారం చేశారు. కేవలం కొద్ది రోజుల్లోనే బాధితురాలికి న్యాయం జరిగినందునే ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లు వివరించింది.

No comments:

Post a Comment