Breaking News

20/08/2019

టీడీపీకి తురుపు ముక్కగా అన్న క్యాంటిన్లు

విశాఖపట్టణం, ఆగస్టు 20, (way2newstv.in)
అన్నా క్యాంటీన్లు ఇపుడు టీడీపీకి అసలైన అస్త్రాలుగా మారుతున్నాయి. వాటిని జూలై 31న మూసేశారు. నాటి నుంచి ఏదో విధంగా విమర్శలు చేస్తూ వస్తున్న తమ్ముళ్ళు ఇపుడు రొడ్డెక్కారు. ఎక్కడికక్కడ తమ సొంత ఖర్చుతో వండి వార్చిన భోజనాన్ని జనాలకు పెట్టడం ద్వారా పేదోడి కూడు సెంటిమెంట్ కి సెగ పుట్టిస్తున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్ రోడ్ల మీద వంటా వార్పు పెట్టి మరీ వినూత్న నిరసనలు చేశారు. అయిదు రూపాయలకు పట్టెడు అన్నం ఇవ్వలేని జగన్ ప్రభుత్వం ఇంక మిగిలిన హామీలు ఎలా తీరుస్తుందని కూడా గట్టిగా విమర్శలు చేస్తున్నారు. పట్టెడన్నం పెట్టలేని పాలన ఎందుకని టీడీపీ చేస్తున్న ఆందోళన వైసీపీకి ఇరకాటంలో పెట్టేలాగానే ఉందితెలుగుదేశం పార్టీ నిజానికి అన్న క్యాంటీన్ల హామీని 2014 ఎన్నికల ముందు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మాత్రం చాలా సులువుగా మరచిపోయింది. 
టీడీపీకి తురుపు ముక్కగా అన్న క్యాంటిన్లు

నాలుగేళ్ల పాటు ఇలా గడిపేసిన తరువాత గత ఏడాది జూలైలో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది కచ్చితంగా ఏడాది మాత్రమే నడిచిన అన్న క్యాంటీన్ల వల్ల జనానికి లాభం ఎంత ఉందో తెలియదు కానీ ఇపుడు అది టీడీపీకి తురుపు ముక్కగా మారుతోంది. అయిదు రూపాయలకే టిఫిన్, భోజనం పెట్టడం అంటే ఓ విధంగా ఇప్పటి రోజుల్లో అది గొప్ప పధకమే. అయితే అన్నార్తులు ఎంతమంది అక్కడ తిన్నారని పరిశీలిస్తే సమాధానం అసంతృప్తిగానే వస్తుంది. కానీ అన్న క్యాంటీన్ల పేరు చెప్పి జనంలో బాగా ప్రచారం చేసుకున్న టీడీపీకి అదిపుడు వైసీపీని నిలదీయడానికి మాత్రం ఉపయోగపడుతోంది. నిజానికి అన్న క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తున్న అక్షయ పాత్రకు పెద్ద ఎత్తున ప్రభుత్వం బకాయి పడిపోయింది. దాన్ని తీర్చకుండానే టీడీపీ పాలన ముగించేసింది. జూలై 31తో కాంట్రాక్ట్ గడువు పూర్తి అవడంతో ఆటోమాటిక్ గా క్యాంటీన్లు మూసేశారు.ఇపుడు అన్న క్యాంటీన్లకు ఉన్న పసుపు రంగుని చెరిపేసే పనిలో వైసీపీ సర్కార్ ఉంది. అన్నగారితో పాటు చంద్రబాబు బొమ్మలను కూడా తుడిచేసి అక్కడ జగన్, వైఎస్సార్ బొమ్మలంతో కొత్త రూపుని తీసుకువస్తారట. పేరు కూడా రాజన్న క్యాంటీన్లుగా మార్పు చేసి సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో మళ్ళీ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాకు చెప్పారు. ఇక దీని మీద తమ ప్రభుతం కచ్చితమైన విధానంతో ఉందని, అన్నార్తులకు అవసరమైన చోటనే క్యాంటీన్లను నడుపుతామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇపుడు ఉన్న వాటిలో కొన్ని తీసేయవచ్చునన్న భావన కూడా ఆయన మాటల్లో వ్యక్తమైయింది. అలాగే ఆసుపత్రులు, రైల్, బస్ స్టేషన్లో వీటిని ఏర్పాటు చేస్తారని ఆయన వెల్లడించారు. ఇలా మంత్రి క్లారిటీగా చెప్పిన తరువాత కూడా టీడీపీ నానా యాగీ చేయడం వెనక రాజకీయ లబ్ది ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎటూ తాము అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని, అవి తమ పోరాట ఫలితమేనని చెప్పుకోవడానికే టీడీపీ ఇలా చేస్తోందని అంటున్నారు. కాగా చంద్రబాబు సైతం తమ పార్టీ నేతలకు అన్న క్యాంటీన్లపై జనంలోకి వెళ్ళమని, వాటిని తిరిగి తెరచేవరకూ పోరాటం చేయాలని చెప్పడం వెనక ఆ క్రెడిట్ కొట్టేయాలన్న రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment