Breaking News

01/08/2019

ఏజెన్సీ ప్రాంతంలో సునీల్ ధియోధర్

విశాఖపట్టణం, ఆగస్టు 1, (way2newstv.in)
ఏపీలో ఎలాగైనా బలపడాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఎన్నికల ముందు ఆ పార్టీ నాయకులు గట్టిగా తిరిగారో లేదో కానీ ఇపుడు మారు మూలల్లో కూడా కనిపిస్తూ హడావుడి చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ ఏపీలోనే ఇపుడు కాపురం ఉంటున్నారు. ఆయన పూటకో ప్రాంతం తిరుగుతూ అటు బాబుని, ఇటు జగన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక సునీల్ డియోధర్ ఒక్కసారిగా విశాఖ ఏజెన్సీలో కనిపించడమే అసలైన విశేషం. విశాఖ ఏజెన్సీలో కలియతిరిగిన సునీల్ అక్కడ నుంచి పార్టీని పటిష్టం చేయాలనుకుంటున్నారు. విశాఖ మైదానాన్ని, రూరల్ ఏరియాని పక్కన పెట్టి మరీ పూర్తిగా గిరిజన ప్రాంతాన్ని సునీల్ డియోధర్ పట్టడం వెనక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో సునీల్ ధియోధర్
ఎటూ విశాఖ సిటీలో బీజేపీ బలపడడం అంటే కొంత కష్టమే. అక్కడ టీడీపీ బలంగా ఉంది. మరో వైపు అధికారంలో ఉన్నందున వైసీపీ కూడా గట్టిగా ఉంది. దాంతో ఏజెన్సీనే సునీల్ డియోధర్ నమ్మారనిపిస్తోంది. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆయన త్రిపుర ఇంచార్జిగా ఉంటూ అక్కడ గిరిజనాన్ని బీజేపీ వైపు తిప్పేశారు. ఏపీలో కూడా ఆ రకమైన ప్రయోగం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏజెన్సీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు కూడా ఎక్కువ చేస్తున్నారు. అక్కడ గిరిజనులు మాట ఇస్తే తప్పరు. వారు నమ్మకంగా పనిచేస్తారు. బీజేపీకి ఇంతకు ముందు కూడా ఏజెన్సీలో అభ్యర్ధులు పోటీకి ఎపుడూ ఉంటూ వచ్చారు. ఈసారి పోటీ కాదు, గెలిచేతీరుతామని ఆ పార్టీ అంటోంది. అందుకోసం టీడీపీ నేతలకు గేలం వేస్తోంది. మరో వైపు వైసీపీ, కాంగ్రెస్ నేతలకు కూడా పిలుపులు అందుతున్నాయట.వైసీపీ నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయిన గిడ్డి ఈశ్వరి మీద బీజేపీ కన్ను పడిందని అంటున్నారు. ఆమెకు టీడీపీలో ఇపుడు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నపుడు కూడా తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని పాత టీడీపీ నేతలు ఆమెను పక్కన పెట్టారు. ఎటూ ఓడిపోయిన తరువాత ఆమె చూపు రాజకీయ భవిష్యత్తు మీద ఉందిట. బీజేపీలో ఆమె చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారుట. ఇక మంత్రిగా అరు నెలల పాటు మెరిసిన కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కుమార్ ని కూడా లాగాలని సునీల్ డియోధర్ చూస్తున్నారుట.మరో వైపు మాజీ కాంగ్రెస్ దిగ్గజం, జనసేన నుంచి పాడేరు తరఫున పోటీ చేసి ఓడిపోయిన పసుపులేటి బాలరాజుని కూడా బీజేపీలోకి తీసుకురావాలనుకుంటున్నారుట. ఇక రూరల్ జిల్లాలో మాడుగులపైన కూడా సునీల్ డియోధర్ కన్ను పడిందట. ఇక్కడ మాజీ టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పార్టీ మారతారా, లేక మొన్నటి ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడిన పైలా ప్రసాదరావు మారతారా అన్నది ఆసక్తిగా ఉంది. అలాగే రూరల్ జిల్లాలో టీడీపీలో డేరింగ్ మహిళా ఎమ్మెల్యేగా పనిచేసి తాజా ఎన్నికల్లో ఓడిన ఓ నాయకురాలి మీద కూడా బీజేపీ ఆకర్ష్ వల పడిందంటున్నారు. మొత్తానికి విశాఖ ఏజెన్సీ నుంచి నరుక్కురావాలని సునీల్ డియోధర్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. సునీల్ డియోధర్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.

No comments:

Post a Comment