Breaking News

13/07/2019

రోజా సౌండ్... తగ్గింది

తిరుపతి, జూలై 13, (way2newstv.com)
ఆర్.కె. రోజా రెడ్డి. వైసీపీ ఫైర్ బ్రాండ్. విపక్షంలో ఉన్నపుడు జగన్ మీద ఈగ వాలనిచ్చేది కాదు. కస్సుమంటూ టీడీపీ మీద పెద్ద పులిలా పడిపోయేది. అసెంబ్లీలో ఆర్.కె. రోజా వేసే పంచ్ లకు చంద్రబాబు సైతం బిత్తర పోవాల్సివచ్చేది. అసలు ఆమె దూకుడు భరించలేకే నాడు అసెంబ్లీ నుంచి రోజాను చంద్రబాబు ఏడాది పాటు సస్పెండ్ చేయించారని అంటారు. అలాంటి ఆర్.కె. రోజా ఇపుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మౌన వ్రతం పాటిస్తున్నారు. గట్టిగా రెండు నెలలు కాకుండానే జగన్ పాలనని ఏకి పారేస్తూ నారా లోకేషులూ, ప్రతిపాటి పుల్లారావులు, ఇతర మాజీలు చెలరేగుతున్నా ఆర్.కె. రోజా సౌండే ఎక్కడా వినిపించడం లేదు. ఇంతకీ రోజా ఎక్కడున్నారు అంటే జబర్దస్త్ షోకి జడ్జిగా కులాసా చేస్తున్నారు. 
రోజా సౌండ్... తగ్గింది

మరి అంతకు ముందు కూడా ఈ షో చేశారు. అయినా అవసరమైన టైంలో పెద్ద నోరు చేసుకుని ప్రత్యర్ధులను చీల్చి చెండాడేవారు. ఇపుడు మాత్రం ఆర్.కె. రోజా మూతి కుట్టేసుకున్నారు. అసలు ఎందికిలా.నిజానికి ఆర్.కె. రోజా ఈసారి గెలిస్తే మంత్రి అవుతుందని అంతా అనుకున్నారు. ఆమె మాత్రమే కాదు, మొత్తం ఏపీలో మెజారిటీ జనం కూడా భావించారు. ఆర్.కె. రోజాకు ఫలానా శాఖ అని సోషల్ మీడియా కూడా ఓ రేంజ్ లో హాట్ హాట్ చర్చలు జరిపింది. ఇంతలా హైప్ క్రియేట్ అయిన తరువాత రోజాను జగన్ పక్కన పెట్టడంతో ఆమె అలిగారని ప్రచారంలో ఉంది. తమ ప్రభుత్వం తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికే ఆమె డుమ్మా కొట్టారు. ఇదేమని అడిగితే మేము రావాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. ఆ తరువాత జగన్ పిలిచి మాట్లాడారని, అంతా సర్దుకుందని వైసీపీ కలరింగ్ ఇచ్చినా ఆర్.కె. రోజా జాడ మాత్రం కానరావడంలేదు. అంటే ఆమె ఇప్పటికీ అలకపానుపు దిగలేదన్న మాట. తనకు మంత్రి పదవే కావాలని ఆర్.కె. రోజా ఇప్పటికీ పట్టుపడుతున్నారనుకోవాలేమో.ఇదిలా ఉండగా ఆర్.కె. రోజాకు ఏ నోరు అయితే రాజకీయంగా దూకుడుని ఇచ్చిందో ఆదే నోరు మైనస్ అయిందని కూడా అంటున్నారు. ఆమెను మంత్రిని చేస్తే తట్టుకోవడం కష్టమన్న వుద్దేశ్యంతోనే పక్కన పెట్టారని కూడా అంటున్నారు. ఓ వైపు సినీ గ్లామర్, మరో వైపు రాజకీయంగా జోరు, ఆమె ధాటిగా మాట్లాడే తీరు ఇవన్నీ కూడా ఆమెను బాగా ఫోకస్ చేస్తాయన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దల్లో ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్.కె. రోజా మరో మైనస్ పాయింట్ జబర్దస్త్. ఈ షో ఎంత పచ్చిగా సాగుతోందో చూసిన వారు చెబుతారు. మహిళా ప్రజాప్రతినిధిగా ఉంటూ అసభ్యంగా సాగే ఈ షోలో ఆర్.కె. రోజా హోస్ట్ గా ఉండడం పట్ల అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.అయితే నాడు ఆమె ప్రతిపక్షం. ఇపుడు అధికార పక్షంలో ఉండి ఇలా చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు అన్న వుద్దేశ్యం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. ఆర్.కె. రోజాని ఈ షో మానేయమని కోరినా ఆమె మానేలా లేదని కూడా అంటున్నారు. దానికి తోడు ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినా కూడా ఈ షో వదలకపోతే మరింత పరువు పోతుందన్న ఆలోచనతోనే పక్కన పెట్టారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల్లో ఓడిన నాగబాబు, గెలిచిన ఆర్.కె. రోజా ఇద్దరూ జబర్దస్త్ కే పరిమితం కావడం విశేషం.

No comments:

Post a Comment