Breaking News

25/07/2019

యడ్డీకి అంత వీజీ కాదు....

బెంగళూర్, జూలై 25, (way2newstv.in)
ఏదో విశ్వాస పరీక్షలో కుమారస్వామిని ఓడించామని సంబరపడి పోతే సరిపోదు. ముందు ముందు యడ్యూరప్ప కు కూడా ముళ్ల బాట తప్పేలా లేదు. కుమారస్వామి విశ్వాస పరీక్ష వీగిపోయిన నేపథ్యంలో యడ్యూరప్ప ఒక వ్యాఖ్య చేశారు. ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి….నాలుగేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని కన్నడ ప్రజలకు మాట ఇచ్చారు. కానీ ఇది ఆచరణలో సాధ్యమా? నాలుగేళ్లు యడ్యూరప్ప సర్కార్ కన్నడ నాట రాజ్యమేలే అవకాశముందా? మరో సంక్షోభానికి అవకాశం లేదా? అంటే ఎందుకు లేవు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. కుమారస్వామి ప్రభుత్వం కేవలం ఆరు ఓట్ల తేడాతోనే ఓటమి పాలయింది. కర్ణాటక శాసనసభలో 225 మంది శాసనసభ్యులున్నారు. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. 
యడ్డీకి  అంత వీజీ కాదు....

అయితేభారతీయ జనతా పార్టీ గత ఏడాది జరిగిన విధానసభ ఎన్నికల్లో గెలుచుకుంది 105 సీట్లు మాత్రమే. అంటే ఇంకా ఎనిమిది మంది సభ్యుల మద్దతు బీజేపీకి అవసరముంటుంది. ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చినా ఇంకా ఆరుగురు సభ్యులు బీజేపీకి అవసరమవుతారు.కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు పదిహేను మంది రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించి ఉప ఎన్నికలకు వెళతారా? లేక అనధికారికంగా మద్దతును పొందుతారా? అన్నది తేలాల్సి ఉంది. రాజీనామాలు ఆమోదించి ఉప ఎన్నికలకు వెళితే అక్కడ గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది లేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.పోనీ రాజీనామా చేసి వెళ్లిపోయిన కాంగ్రెస్,జేడీఎస్ శాసనసభ్యులు తిరిగి సభకు వస్తే యడ్యూరప్ప పార్టీ బలం తగ్గిపోయినట్లే. మరి ఈ గండం యడ్యూరప్పను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. రేపు యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన తర్వాత బీజేపీలోనూ అసంతృప్తులు తలెత్తవన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు మద్దతిచ్చిన వారు సయితం రేపు ఎదురుతిరిగరన్న ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సో… కర్ణాటకకు యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయినా దినదినగండంగానే గడపాల్సి ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.

No comments:

Post a Comment