Breaking News

23/07/2019

కిడ్నాపైన చిన్నారి కోసం గాలింపు

కాకినాడ, జూలై 23 (way2newstv.in)
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపింది. సోమవారం రాత్రి ఆడుకుని ఇంటికి వస్తున్న బాలుడిని బైక్‌పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండపేట పట్టణంలో కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి వచ్చిన వివరాలు తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూక వెంకటరమణ, నాగవల్లికి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు జషిత్ ఉన్నాడు. దంపతులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. బదిలీలో భాగంగా ఏడాది క్రితం మండపేటకు వచ్చిన ఆ కుటుంబం విజయలక్ష్మీ నగర్‌లోని సాయిధరణి ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్‌లో నివాసముంటోంది. 
కిడ్నాపైన చిన్నారి కోసం గాలింపు

వీరి కుమారుడు జషిత్ సమీంలోని ఓ కార్పోరేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. జషిత్ రోజూ స్కూల్ నుంచి వచ్చాక పక్కనే ఉండే గ్రౌండ్‌లో తోటి పిల్లలతో ఆడుకుంటాడు. శనివారం కూడా గ్రౌండ్‌కు వెళ్లిన బాలుడు రాత్రి 7.30 గంటల సమయంలో నాయనమ్మతో కలిసి ఇంటికి తిరిగొస్తున్నాడు. వారిద్దరూ మెట్లు ఎక్కుతుండగా బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ ఉందా? అని ఆమెను అడిగాడు. లేదని ఆమె చెప్పగానే ముఖంపై కొట్టి బాలుడిని బైక్‌పై ఎత్తుకుపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటన నుంచి వృద్ధురాలు తేరుకునేలోగానే దుండుగుడు పిల్లాడితో జంప్ అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలియగానే తల్లి తల్లడిల్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. చీకటిగా ఉండటంతో కిడ్నాపర్‌ను గుర్తుపట్టలేదని బాలుడి నాయనమ్మ చెబుతోంది. తమకు ఎవరితోనూ గొడవలు, తగాదాలు లేవని, ఎవరిపైనా అనుమానం లేదని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు కిడ్నాపర్‌గా స్పెషల్ టీమ్స్ ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. రెండు వారాల క్రితం ఇదే అపార్ట్‌మెంట్ వద్ద నిలిపి ఉంచిన బాలుడి తండ్రి బైక్‌ కనిపించకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా బాలుడినే ఎత్తుకెళ్లడంతో ఇది తెలిసినవారి పనేనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment