Breaking News

01/07/2019

బీజేపీలో ..టీడీపీ కోవర్టులు...


హైద్రాబాద్, జూలై 1, (way2newstv.in)
ఎడారిలో మంచి నీళ్ళు అయినా పుట్టించవచ్చు కానీ ఏపీలో బీజేపీని వికసింపచేయలేమని కమలనాధులు చేతులెత్తేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి తాజా పరిణామాలు మింగుడుపడడంలేదుట. ఏ అధికారం లేకపోయినా దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని పక్కన పెట్టేసి నిన్నటి దాకా టీడీపీలో అన్నీ అనుభవించిన వారికి పెద్ద పీట వేయడానికి హై కమాండ్ సిధ్ధపడిపోవడాన్ని వీరంతా సహించలేకపోతున్నట్లుగా భోగట్టా. ఏపీలో చూసుకుంటే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీ కండువా కప్పేసుకుని నామాలు తగిలించేసుకున్నారు. మరి కొంత మంది తమ్ముళ్ళు ఇదే రూట్ పడుతున్నారు. . తమ వారిని, వందిమాగధులను బీజేపీలోకి చేర్పించడం ద్వారా టీడీపీకి బీ టీమ్ గా తయారుచేయాలనుకుంటున్న సుజనాచౌదరి వంటి వారి జోరు చూస్తున్న అసలైన బీజేపీ నాయకులు ఈ పార్టీ మాది కాదు కాదనుకుంటున్నారుట. 

బీజేపీలో ..టీడీపీ కోవర్టులు...

ఇక వారి హవా చూసిన పాతతరం నాయకులు తట్టుకోలేమని నిర్ణయానికి వచ్చేస్తున్నారుబీజేపీలో ఇలాంటి చేరికలు ఎపుడూ కొత్త కాదని, అయితే ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదన్నది హై కమాండ్ మననం చేసుకోవాలని అంటున్నారు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం బీజేపీ వాజ్ పేయ్ గాలి చూసి ఏపీలో ఎంతో మంది యోధానుయోధులు కమలం గూటికి చేరారని, వారంతా ఇపుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం, మోహన్ బాబు, క్రిష్ణం రాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కమాలుద్దీన్ వంటి నాయకులు పార్టీలో చేరినా కూడా తరువాత రోజుల్లో వెనక్కు వెళ్ళిపోయారని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల పార్టీని వచ్చిన వారు ఉపయోగించుకుంటున్నారు తప్ప పార్టీ ఎదిగేందుకు ఎవరూ చేసింది లేదని అర్ధమవుతోంది కూడా చెబుతున్నారు. ఇక ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చిన వారు పార్టీ అధికారం చూసే మోజుపడుతున్నారని అంటున్నారు. రేపటి రోజున తేడా వస్తే మళ్ళీ వారు సొంత గూటికి వెళ్ళిపోవడానికి తయారుగా ఉంటారని అంటున్నారు.బీజేపీ ఎదుగుదల అట్టడుగు స్థాయి నుంచి రావాలని, పార్టీకి గట్టి నేతలుగా ఉన్న వారికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ సమయంలోనైనా అవకాశాలు ఇచ్చి నాయకత్వం పెంచాలని అసలైన బీజేపీ నాయకులు సూచిస్తున్నారు. సోము వీర్రాజు, మాజీ మంత్రి పైడి కొండలరావు, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారిని పార్టీ చేరదీసి ముందుండి నడిపిస్తే కమలానికి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఇపుడు బీజేపీలో చేరిన వారంతా టీడీపీ స్లీపర్ సెల్స్ లాంటి వారని కూడా కమలనాధులు హెచ్చరిస్తున్నారు. వీరి మనసు ఎపుడూ సైకిల్ పార్టీ మీదనే ఉంటుందని, ఆ పార్టీ పుంజుకోగానే బీజేపీకి రాం రాం చెప్పేస్తారని కూడా అంటున్నారు. మరి బీజేపీ ఢిల్లీ పెద్దల తీరు మాత్రం వేరేగా ఉంది. ఏపీలో విస్తరణ హఠాత్తుగా జరిగిపోవాలంటే ఫిరాయింపులే శరణ్యమని భావిస్తున్నారు. దీంతోనే సిసలైన కార్యకర్తలు, నాయకులు పార్టీ పట్ల అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు

No comments:

Post a Comment