Breaking News

19/06/2019

ఆర్థిక శాఖ అధికారులతో మోడీ భేటీ


న్యూఢిల్లీ, జూన్ 19 (way2newstv.in)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో ఈ నెల 20న సమావేశం కాబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగ కల్పనపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో అదేరోజు జరుగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆ మరుసటిరోజుకు వాయిదా పడనున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఆర్థిక శాఖ అధికారులతో మోడీ భేటీ
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన జీడీపీని మళ్లీ పెంచాలనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ప్రత్యేక రోడ్ మ్యాప్‌పై మోదీ ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది. జూలై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కంటే ముందుగా ఈ సమావేశం జరుగుతుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. దీంతోపాటు మోదీ సర్కార్ 2.0 ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వంద రోజుల ఎజెండా కూడాదీంట్లో చర్చకు రానున్నది. ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, ఖర్చులు, ఆర్థిక సేవలు, దీపం విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వృద్ధి పెంచడానికి, ఉద్యోగ కల్పన, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రెవెన్యూ మంత్రిత్వ శాఖ..పన్నుల పరిధి మరింత విస్తరించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, జీఎస్టీపై నివేదిక సమర్పించనున్నది.

No comments:

Post a Comment