ఒకే గొడుగు కిందకు ఐదు శాఖలు
కరీంనగర్, మే 13, (way2newstv.in)
భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న సేల్ డీడ్ రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ పట్టాల స్థానంలో కంక్లూజివ్ టైటిల్ను తీసుకొచ్చేందుకు రూపొందిస్తున్న కొత్త రెవెన్యూ చట్టంపై నిపుణుల కమిటీ చేపట్టిన కసరత్తు పూర్తి కావొచ్చింది. చట్టం ఎలా ఉండాలనే అంశాలపై పలుమార్లు చర్చించిన కమిటీ సభ్యులు డ్రాఫ్ట్ను సిద్ధం చేసినట్లు సమాచారం.వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, భవనాలకు సంబంధించిన క్రయ, విక్రయాలు ప్రస్తుతం రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ లేదా పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరుగుతున్నాయి.
తుది దశలో రెవెన్యూ చట్టం
ఒకే భూమికి సంబంధించిన పనిని వేర్వేరు శాఖలు ఎవరికివారుగా చేపట్టడం, ప్రజలు కూడా ఒక పని గురించి రెండు, మూడు శాఖల చుట్టూ తిరగాల్సి వస్తుండడంతో ఈ ఐదు శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని డ్రాఫ్ట్లో ప్రతిపాదించారు. కంక్లూజివ్ టైటిల్ను ఇచ్చేందుకు అనుసరించాల్సిన రోడ్ మ్యాప్తోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల చట్టం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఆర్ఓఆర్ చట్టాల్లో చేయాల్సిన సవరణలను, భూవివాదాలను పరిష్కరించేందు ఏర్పాటు చేసే కోర్టులు/ట్రిబ్యునళ్ల అధికారాలను ముసాయిదాలో చేర్చినట్లు తెలిసింది. ఈ డ్రాఫ్ట్లో చేయాల్సిన చేర్పులు, మార్పులపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలోని ఈ కమిటీ మరో రెండుసార్లు సమావేశమై తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది.వారం రోజుల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేసిన తర్వాత చట్టంలో న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు అడ్వకేట్ జనరల్కు పంపనున్నారు. ఐదారు రోజుల్లో న్యాయ సలహా తీసుకున్న తర్వాత డ్రాఫ్ట్ బిల్లును కేబినేట్ ముందు పెట్టనున్నారు. ఈ నెల 27న ఎన్నికల కోడ్ ముగిశాక ఈ నెలాఖరులో జరగనున్న రాష్ట్ర కేబినేట్ భేటీలో కొత్త రెవెన్యూ చట్టమే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలిసింది. రాష్ట్ర కేబినేట్ ఆమోద ముద్ర వేశాక జూన్ మొదటివారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందాక చట్ట రూపం తీసుకోనుంది.
No comments:
Post a Comment