Breaking News

15/05/2019

అన్నీ అవస్థలే.. (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, మే 14 (way2newstv.in): 
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు కరువయ్యాయి. రోజురోజుకూ జిల్లాలో ఎండలు మండుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు సేదతీరడానికి టార్పిన్లు అందించకపోవడంతో ఎండలోనే సేదతీరాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు పంపిణీ చేస్తారు. కానీ ఈ ఏడాది వాటి పంపిణీ కూడా జరగకపోవడంతో ఏదైనా గాయమైతే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదికి సంబంధించిన పస్ట్‌ ఎయిడ్‌ బాక్సులను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నా.. అవి మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా 2018–19లో కూలీలకు కనీస వేతనంగా రూ.205 అందించారు.కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతన కొలమానం ప్రకారం.. ఈ ఏడాది 2019–20 ప్రకారం కూలీలకు రోజు వారీ వేతనాన్ని మరో రూ.6 పెంచారు. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో వాటిని కూడా సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. పెంచిన వేతనంతో జిల్లాలో లక్షలాది మందికి మేలు కలుగనుంది. జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 38 లక్షల పని దినాలను కల్పించారు. 


అన్నీ అవస్థలే.. (ఆదిలాబాద్)

ఇందులో 6,550 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కూలీలకు ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.64 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో కూలీలకు డబ్బులు రాకపోవడంతో పనులకు సైతం వెళ్లేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని కూలీలు పేర్కొంటున్నారు.ఎండల్లో పని చేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పనులు చేసి కూడా సకాలంలో డబ్బులు రాకపోతే తమ కుటుంబాలను పోషించుకేనేదేలా అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది కూలీలకు గతేడాది డిసెంబర్‌ నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో 13 మండలల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా, రెండు నెలల నుంచి ఒక్కో మండలానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని  అధికారులు చెబుతున్నారు.ఉపాధి పనుల్లో జాబ్‌ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం  వంద పనిదినాలు కల్పిస్తారు. ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. హరిత హారం కోసం పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎక్కువ పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు కనీసం రూ. 190 వేతనం వచ్చేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 2018–19లో జిల్లాలో కూలీలకు సగటు వేతనం 178 మాత్రమే అందింది. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలు  ఉదయం పూటనే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 63 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు లక్ష మంది కూలీలకు ఉపాధి  కల్పిం చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఇందులో 13 మండలలోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు. జిల్లాలో ఆయా మండలల్లోని ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో లక్ష మందికి రోజు కూలీ పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సకాలంలో డబ్బులు రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో వారి లక్ష్యం చేరడం కష్టంగా మారింది. 

No comments:

Post a Comment