హైద్రాబాద్, మే 4, (way2newstv.in)
మహానగరంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణతాపానికి వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. నగరంలో గతవారం రోజులుగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణ వేడిమి వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతోంది. ట్రాఫిక్ కారణంగా ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు పెట్రొల్ ట్యాంక్లో పోస్తున్న ఇంధనం వాహనాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. మరోవైపు ఎండల్లో పార్కింగ్ ఇంధనంపై మరింత ప్రభావం చూపుతోంది.
ఎండలకు ఇంధనం ఆవిరి
ఉదయం ఏడు గంటల నుంచి ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో వాహనాలు వేడెక్కుతున్నాయి. ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి అవిరై గాలిలో కలుస్తోంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 430 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజూ 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్లను పోయించుకుంటున్నారు. దీంతో వాహనాల ట్యాంకులు ఉష్ణాతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ ఉష్ణతాపానికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు అవసరం ఉన్న మేరకే పెట్రోల్ పోయించుకోవాలని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment